టిడిపికి యనమల కృష్ణుడు రాజీనామా

– రేపు సిఎం సమక్షంలో వైసిపిలో చేరిక
ప్రజాశక్తి – కోటనందూరు (కాకినాడ జిల్లా) :కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో టిడిపికి భారీ షాక్‌ తగిలింది. టిడిపి సభ్యత్వానికి, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ ప్రధాన కార్యదర్శి పదవికి యనమల కృష్ణుడు రాజీనామా చేశారు. శుక్రవారం తునిలో తన నివాసంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. తన సోదరుడు యనమల రామకృష్ణుడు తనను మోసం చేశారని ఆరోపించారు. తుని నియోజకవర్గంలో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయానని, ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో తనకు సీటు ఇస్తే గెలిచేవాడినని చెప్పారు. తనను కాదని తన కుమార్తె దివ్యకు యనమల రామకృష్ణుడు సీటు ఇప్పించారని విమర్శించారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, తనను కాదని యనమల రామకృష్ణుడుకు ఎమ్మెల్సీ పదవి, అతని అల్లుడికి నామినేటెడ్‌ పదవి ఇచ్చేలా చంద్రబాబుతో ఒప్పందం చేసుకుని తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తాడేపల్లిలో వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో తన అనుచరులతో కలిసి వైసిపిలో చేరుతున్నట్టు తెలిపారు.

➡️