పెనమలూరు (కృష్ణా) : 6 నెలల చిన్నారి తన అద్భుతమైన జ్ఞాపక శక్తితో అంతా నివ్వెరపోయేలా చేసింది.. అంతేకాదండోరు… ఏకంగా ‘నోబెల్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ’ లో చోటుదక్కించుకుంది. బంగారు పతకాన్ని అందుకుంది. కృష్ణా జిల్లా యనమలకుదురుకు చెందిన ఇడుపులపాటి నితిన్, తనూజలు దంపతులు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీరికి అయిదు నెలల కుమార్తె ఉంది. పేరు జైత్రి. పుట్టిన కొద్దిరోజులకే తనకున్న జ్ఞాపక పటిమ, గుర్తింపు, గ్రహింపు శక్తిని తల్లిదండ్రులు గుర్తించారు. ఈక్రమంలో పాపకు వివిధ రకాల మొక్కలు చూపిస్తూ వాటి సాధారణ పేర్లతో పాటు శాస్త్రీయ నామాలను చెప్పడం మొదలుపెట్టారు. కొన్ని రోజులకు పాప వంద రకాల మొక్కల్లో దేని పేరు చెప్పినా వెంటనే ఫ్లాష్కార్డ్ ఆల్బమ్లో వాటిని ఇట్టే గుర్తిస్తోంది. ఇది తెలుసుకున్న హైదరాబాద్కు చెందిన ‘నోబెల్ వరల్డ్ రికార్డ్ సంస్థ’ పాప ప్రతిభను పరీక్షించింది. అనంతరం జైత్రికి ప్రశంసాపత్రంతోపాటు బంగారు పతకాన్ని అందజేసింది. చిన్నారిని బంధుమిత్రులతో పాటు గ్రామస్థ్థులు అభినందిస్తున్నారు.