ముంబయి : రిలయన్స్ ఇండిస్టీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కలిశారు. బుధవారం ఉదయం సిఎం నివాసానికి వెళ్లిన అంబానీ జులై 12 న జరగనున్న తన కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి హాజరుకావాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. అంబానీతోపాటు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ కూడా షిండేను కలిశారు. వారిని సాదరంగా ఆహ్వానించిన సిఎం కుటుంబసభ్యులు రాధికా మర్చంట్కు వినాయకుడి ప్రతిమను బహూకరించారు. కాగా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ సోమవారం ముంబయిలోని అజయ్ దేవగన్ ఇంటికి వెళ్లి తమ వివాహానికి రావాల్సిందిగా స్వయంగా ఆహ్వానించారు. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్, వ్యవస్థాపకురాలు నీతా అంబానీ కాశీ విశ్వనాథుడిని దర్శించి తొలి వివాహ ఆహ్వాన పత్రిక సమర్పించి ఆశీస్సులు పొందారు. దర్శనానంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ … ” మన సాంప్రదాయం ప్రకారం ముందుగా భగవంతుడి ఆశీస్సులు తీసుకుంటాము. భగవంతుడికి వివాహ ఆహ్వాన పత్రికను సమర్పించాను. 10 ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కాశీ విశ్వనాథ్ కారిడార్, నమో ఘాట్, సోలార్ ఎనర్జీ ప్లాంట్లు, పరిశుభ్రతను చూస్తుంటే సంతోషంగా ఉంది” అని తెలిపారు. రిలయన్స్ ఇండిస్టీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ల వివాహం జులై 12న ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. 2022లో రాజస్థాన్లోని నాథ్ద్వారా పట్టణంలోని శ్రీనాథ్జీ ఆలయంలో వీరి నిశ్చితార్థం జరగ్గా ఇటీవల మార్చి 1 నుంచి 3 వరకు జామ్నగర్లో మూడు రోజుల పాటు ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి.