న్యూఢిల్లీ : పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ప్రధాని మోడీ ప్రభుత్వం మౌనం వహిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఒబ్రెయిన్ బుధవారం విమర్శించారు. ప్రధాని మోడీ హయాంలో పార్లమెంట్ చీకటి గది, అగాథంలా మారిందని ధ్వజమెత్తారు. 2001లో పార్లమెంటు దాడి తర్వాత, అప్పటి ప్రధాని మరియు హోం మంత్రి లోక్సభ మరియు రాజ్యసభలో ప్రకటనలు ఇచ్చారని అన్నారు.
” పార్లమెంటు రికార్డుల ప్రకారం.. 2001 డిసెంబర్లో పార్లమెంటుపై దాడి జరిగిన తర్వాత ఉభయసభల్లో చర్చ జరిగింది. అప్పటి హోం మంత్రి ఎల్.కె. అద్వానీ సమాధానమివ్వగా, ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఉభయసభల్లోనూ జోక్యం చేసుకున్నారు” అని ఒబ్రెయిన్ ఎక్స్లో పేర్కొన్నారు. 2023 పార్లమెంటు భద్రతా వైఫల్యంపై మోడీ ప్రభుత్వం మౌనం వహించిందని మండిపడ్డారు. హోంమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేసినందుకు 146 ప్రతిపక్ష ఎంపిలు సస్పెండ్ అయ్యారని ధ్వజమెత్తారు.