ప్రజాశక్తి – మాచర్ల (పల్నాడు జిల్లా) :ఎన్నికల నేపథ్యంలో తలెత్తిన ఘర్షణల్లో గాయపడిన, నష్టపోయిన టిడిపికి చెందిన వారిని నాయకులు పరామర్శించేందుకు చేపట్టిన ‘చలో మాచర్ల’కు పోలీసులు అనుమతిని నిరాకరించడంతోపాటు వెళ్లడానికి ప్రయత్నించిన వారినీ అడ్డుకున్నారు. టిడిపి నాయకులను ఎక్కడికక్కడే ముందస్తుగా గృహ నిర్బంధాల్లో ఉంచారు. మాచర్ల పట్టణంలోనూ 144 సెక్షన్ విధించి బయటి వారు ఎవరూ రాకుండా కట్టడి చేశారు. దుకాణాలు, ఇతర కార్యాలయాలను మూసేయించారు. పట్టణంలోని పలువురు టిడిపి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా మాచర్లకు వెళ్లేందుకు ప్రయత్నించిన టిడిపి పొలిట్బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు, మాచర్ల నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి, నాయకులు కె.శ్రీనివాసరావును గుంటూరులో గృహ నిర్బంధంలో ఉంచారు. విజయవాడ నుంచి బయలుదేరిన మాజీ మంత్రి దేవినేని ఉమ, వర్ల రామయ్యనూ గృహ నిర్బంధంలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/17-22.jpg)