- జిఓ నెంబరు 1 విడుదల
- పార్కు వర్కర్లను చేర్చాలన్న సిఐటియు
- మిగిలిన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగింపు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మున్సిపల్ కార్మికుల సమ్మె నేపథ్యంలో శానిటేషన్ డ్రైవర్లు, యుజిడి వర్కర్లు, మలేరియా కార్మికులకు ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీచేశారు. మున్సిపల్ కార్మిక సంఘాలు ఇచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ ఉత్తర్వులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. వెంటనే ఇది అమల్లోకి వస్తుందని, జిఓలో పేర్కొన్న మూడు విభాగాల సిబ్బందికి నెలకు రూ.6000 చొప్పున చెల్లిస్తామని పేర్కొన్నారు.జిఓ నెంబరు ఒకటిలో పేర్కొన్న విభాగాలతోపాటు పార్కుల్లో పనిచేసే వర్కర్లకూ ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ చెల్లించాలని ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్(సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు కోరారు. ఈ మేరకు సోమవారం మంత్రి ఆదిమూలపు సురేష్కు లేఖ రాశారు. డిసెంబర్లో సమ్మె ప్రారంభమైన తరువాత 28వ తేదీన సంఘ నాయకులతో చర్చలు జరిపారని, అంతకుముందు 2023 డిసెంబరు 14వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి చర్చించారని పేర్కొన్నారు. ఈ రెండు సందర్భాల్లో యుజిడి, డ్రైవర్లు, మలేరియా కార్మికులతోపాటు పార్కులో పనిచేసే సిబ్బందికీ ఓహెచ్ఏ మంజూరు చేస్తామని హామీనిచ్చారని జిఓలో అది లేదని తెలిపారు. 31వ తేదీన పంపించిన మినిట్స్లోనూ అంగీకరించినట్లు ప్రస్తావించారని తెలిపారు. అయినా జిఓలో పార్కు వర్కర్లను చేర్చకపోవడం సరికాదని, వెంటనే జిఓను సరిదిద్ది వారిని కూడా చేర్చాలని కోరారు. అదే సమయంలో మున్సిపల్ వర్కర్ల మిగిలిన డిమాండ్లను కూడా పరిష్కరించాలని, అంతవరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు.