కోల్కతా : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అధికారులపై దాడి జరిగిన పందొమ్మిది రోజుల అనంతరం టిఎంసి నేత షాజహాన్ షేక్ నివాసంలో మరోసారి సోదాలు జరిపారు. లక్షలాది రూపాయల రేషన్ పంపిణీ స్కామ్కు సంబంధించి బుధవారం ఉదయం నార్త్ 24 పరగణాస్ జిల్లాలో పరారీలో ఉన్న నేత నివాసంలో సోదాలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. 120 మందికి పైగా కేంద్ర బలగాలతో పాటు ఈడి అధికారులు సందేశ్ఖాలీ ప్రాంతంలోని షేక్ నివాసాన్ని ఇద్దరు స్థానికుల సమక్షంలో తెరిచినట్లు పేర్కొన్నారు. ఈ రోజు షేక్ ఇంటిని వెతుకుతున్నామని, స్థానికులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. ఇంటిలోకి ప్రవేశించే ఈడి అధికారులు లోపలి నుండి గేట్లకు తాళాలు వేసి సోదాలు ప్రారంభించినట్లు తెలిపారు.
జనవరి 5న షేక్ మద్దతుదారులు ఈడి అధికారులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ముగ్గురు అధికారులు గాయపడ్డారు. కాగా, షేక్ ఇప్పటికీ పరారీలో ఉన్నారు.