న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ న్యూయార్క్లోని అమెరికా తూర్పు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన సంకేత్ జయేశ్ బల్సారా (46)ను నియమించినట్లు శ్వేతసౌధం ప్రకటించింది. జో బైడెన్ భారత సంతతికి చెందిన న్యాయమూర్తిని నామినేట్ చేశారు.
సంకేత్ 2017 నుంచి ఇదే కోర్టులో మేజిస్ట్రేట్గా పనిచేస్తున్నారు. ఇప్పుడాయన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. న్యాయమూర్తి పదవిని చేపట్టిన తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తిగా సంకేత్ రికార్డులకెక్కారు. న్యూయార్క్లోని డిస్ట్రిక్ట్ కోర్టులో పనిచేస్తున్న సంకేత్.. సెక్యూరిటీలు, కాంట్రాక్టులు, దివాలా, నియంత్రణ విషయాలలో నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. అతని తల్లిదండ్రులు 50 సంవత్సరాల క్రితం భారతదేశం నుంచి ఇక్కడకు వలస వచ్చి స్థిరపడ్డారు. సంకేత్ న్యూ రోషెల్లో జన్మించారు. అతని తండ్రి ఇంజనీర్గా పనిచేశారు. తల్లి నర్సుగా పనిచేస్తున్నారు. సంకేత్ 2002లో హార్వర్డ్ లా స్కూల్ నుండి జేడీ, 1998లో హార్వర్డ్ కళాశాల నుండి ఏబీ పట్టా పొందారు. ప్రస్తుతం సంకేత్ తన భార్య క్రిస్టీన్ డెలోరెంజోతోపాటు లాంగ్ ఐలాండ్ సిటీలో నివాసముంటున్నారు.