ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్ఎ మేకపాటి విక్రమ్ రెడ్డి
అర్హులందరికీ ‘వైఎస్ఆర్ జలకళ’
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ ఆత్మకూరు నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతీ రైతుకు వైఎస్ఆర్ జలకళ ద్వారా బోర్లు ఏర్పాటు చేసి వారికి సాగునీటిని అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంఎల్ఎ మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. మంగళవారం నెల్లూరులోని మేకపాటి క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్సార్ జలకళ పథకానికి సంబంధించి ఎన్ఆర్ఇజిఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ మేకపాటి విక్రమ్రెడ్డి నియోజకవర్గంలో వైఎస్ఆర్ జలకళకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంఎల్ఎ మేకపాటి విక్రమ్రెడ్డి సన్న చిన్న కారు రైతులకు 2.5 ఎకరాల భూమి కలిగిన రైతులకు భోరు ఏర్పాటు చేసి వారికి సాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ పథకం అందరూ సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ వ్యాప్తంగా 2559మంది దరఖాస్తు చేసుకున్నారని, అధికారుల నివేదికల అనంతరం 914మందికి బోర్లు మంజూరు చేసి, ఇప్పటి వరకు 865మందికి బోర్లు వేసినట్లు, ఇందుకోసం రూ.8.691 కోట్లు మంజూరు చేసినట్లు ఎంఎల్ఎ వివరించారు. మిగిలిన వారికి కూడా త్వరితగతిన సర్వే నివేదికలు పూర్తి చేసి బోర్లు వేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా రైతులు ఎవరైనా వైఎస్సార్ జలకళ బోర్ల కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి మంజూరు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, సమస్యలు ఏమైనా వస్తే తన దృష్టికి తీసుకొస్తే జిల్లా కలెక్టర్కు తెలిపి మంజూరు చేయిస్తామన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో వైఎస్ఆర్ జలకళ బోర్ల ఏర్పాటును వేగవంతం చేయాలని సూచించారు. అవసరమైతే స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు సహాయ సహకారాలు అందిస్తారని, రైతులకు వైఎస్ఆర్ జలకళ ద్వారా బోర్లను ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.