ప్రజాశక్తి -సీలేరు :
జీకే వీధి మండలం దుప్పులవాడ పంచాయతీ పరిధి వలసపల్లి గ్రామంలోని గిరిజనులకు సిఆర్పిఎఫ్ 42 బెటాలియన్ సెకండ్ ఇన్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, జీకే వీధి సిఐ అప్పలనాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం సోలార్ లైట్లు పంపిణీ చేశారు. గిరిజనులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ అప్పలనాయుడు మాట్లాడుతూ యువత సంఘ విద్రోహ శక్తులకు దూరంగా ఉండాలని కోరారు. సివిక్ యాక్షన్ ప్లాన్లో భాగంగా సిఆర్పిఎఫ్ మారుమూల గిరిజన గ్రామాల్లో అవసరమైన వ్యవసాయ పరికరాలు ఇంతకుముందే పంపిణీ చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై రామకృష్ణ, సిఆర్పిఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.