ప్రజాశక్తి – నెలిమర్ల : మండలంలోని తంగుడుబిల్లిలో జనసేన ఆధ్వర్యంలో శనివారం రాత్రి మన ఊరిలో జన వాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నియోజక వర్గం ఇంఛార్జి లోకం మాధవి గ్రామంలో ఇంటింటికి పర్యటించారు. ఈ సందర్భ ంగా ఆమె గ్రామస్తులతో మాట్లాడుతూ ఈ దుష్ట పాలనని అంతమొందించి ప్రజా పాలనకు నాంది పలకాలన్నారు. ఎన్నికలకు ముందు వచ్చి చేయలేని వాగ్దానాలు ఇచ్చినందు వల్లనే నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుబడిందన్నారు. గ్రామంలో నిరుద్యోగ యువత కలిసి వారికి ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. ఇన్ని ప్రభుత్వాలు మారినా గ్రామానికి వచ్చే రోడ్డుపైన ఇప్పటివరకు దృష్టి పెట్టలేదన్నారు. వైసిపి నాయకులు పంచాయతీ నిధులని అడ్డగోలుగా నొక్కేసి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తాను అధికారంలోకి వస్తే తంగుడిబిల్లి స్థితిగతులను మార్చే బాధ్యతను తాను తీసుకుంటానని, ప్రతి ఇంటికి కులాయి తెప్పించే చొరవ తాను తీసుకుంటానని లోకం మాధవి తెలిపారు. ఈ కార్యక్రమంలో కరుమజ్జి గోవింద, శేఖర్, రామ్నాయుడు, మధు, సాకేత్, అప్పల నాయుడు, జనసేన వీర మహిళలు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/nml-jsp.jpg)