నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం

మంత్రి

ప్రజాశక్తి-కాజులూరునాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని బిసి సంక్షేమం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తెలిపారు. కాజులూరులో శుక్రవారం సమగ్ర శిక్షా విభాగం ఆధ్వర్యంలోని భవిత కేంద్రాన్ని ఆయన సందర్శించారు. 8 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన మూగ, చెవిటి, వికలాంగ విద్యార్థులకు ప్రత్యేక పాఠ్య ప్రణాళిక, యాప్‌లతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన టాబ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం సమాజ ప్రగతికి ఎంతో అవసరమని, ఈ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత, కేటాయింపులు ఇస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాడు-నేడు, అమ్మఒడి, విద్యాకానుక, విద్యా దీవెన, వసతి దీవెన, ఆంగ్ల మాధ్యమంలో బోధన, టాబ్‌ల పంపిణీ ఎన్నో కార్యక్రమాల ద్వారా నాణ్యమైన విద్య పేదలందరికీ అందుబాటులోకి వచ్చిందని, రాష్ట్ర విద్యా రంగంలో నవ శకం ఆవిష్కారమైందన్నారు. వికలాంగ విద్యార్థుల్లో ప్రజ్ఞా పాటవాలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వెలికి తీసి ప్రోత్సహించాలని, అందరితో పాటు వారికి కూడా సమాన అవకాశాలు కల్పించాలని మంత్రి కోరారు. భవిత కేంద్రంలో చదువుతున్న పిల్లలకు ట్యాబ్‌ల ద్వారా మరింత మెరుగైన బోధన అందించాలని ఉపాధ్యాయులు, శిక్షకులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు వనుం వెంకట సుబ్బారావు, వైసిపి అధ్యక్షుడు గుబ్బల యేసురాజు, మంజేరు సహకార సంఘ అధ్యక్షుడు గండి కిషోర్‌, ఎంఇఒ పి.జాన్‌ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️