– అందుబాటులోకి రానున్న నాణ్యమైన వైద్యంప్రజాశక్తి – పులివెందుల టౌన్ పట్టణ పరిధిలోని కడపరోడ్డు బెస్తవారిపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నారు. కళాశాల ప్రారంభమైతే పులివెందుల నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు నాణ్యమైన వైద్యంతో పాటు విద్యార్థులకు అందుబాటులోనికి రానుంది. 50 ఎకరాల విస్తీర్ణంలో రూ.500 కోట్లతో ప్రభుత్వ వైద్య, నర్సింగ్ కళాశాలను నెలకొల్పారు. అధునాతనమైన పరికరాలతో కళాశాలను నిర్మించారు. కళాశాలలో మొదట సంవత్సరం 100 సీట్లు కేటాయిస్తారు. ఈనెల చివరి వారంలో ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి చేత ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అందుబాటులోకి రానున్న మెరుగైన వైద్యం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో వైద్య కళాశాల ప్రారంభమైనప్పటి నుంచి మెరుగైన వైద్య సేవలు అందించడానికి నిపుణులైన వైద్యులతో పాటు నాణ్యమైన వైద్య పరికరాలను అందుబాటులోకి తేనున్నారు. కళాశాలకు కావాల్సిన అన్ని విభాగాలకు సంబంధించిన వైద్యులను నియమించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తుంది.