ప్రజాశక్తి-రాయదుర్గం : రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులు చేస్తున్న సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్లుగా పట్టీ పట్టనట్లుగా వ్యవహరించడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తోందని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లికార్జున అన్నారు. మున్సిపల్ కార్మికులు చేపట్టిన రాష్ట్ర నిరవధిక సమ్మె ఆరవ రోజులో భాగంగా ఆదివారం రాయదుర్గం పట్టణంలోని వినాయక కూడలి నుండి శిబిరం వరకు అర్ధ నగ్నంగా ప్రదర్శన చేపట్టి రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మున్సిపల్ ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె పట్ల అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను చేయడాన్ని మానుకొని తక్షణమే మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కరించేందుకు చొరవ చూపాలని లేనిపక్షంలో ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు రాము, తిప్పేస్వామి మల్లేష్, తిప్పేరుద్ర, మైలారప్ప నరసింహులు మరియు పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికులు పాల్గొన్నారు.