ఐక్యతా అభివాదం చేస్తున్న అభ్యర్థి ఎం.రాధాకృష్ణ, ఇండియా వేదిక పార్టీల నాయకులు
ప్రజాశక్తి – చిలకలూరిపేట : ఆర్ఎస్ఎస్ భావజాతంలో మనువాద రాజ్యాంగాన్ని తేబూనుకున్న కేంద్రంలోని బిజెపిని మరోసారి గద్దెనెక్కకుండా నిలువరించాలని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.రాధాకృష్ణ అన్నారు. చిలకలూరిపేటలో ఇండియా వేదిక తరుపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎం.రాధాకృష్ణ గెలుపు కోసం కృషి చేద్దామన్నారు. స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ఇండియా వేదిక పార్టీల తొలి సమావేశం గురువారం జరిగింది. సమావేశానికి అభ్యర్థి ఎం.రాధాకృష్ణ అధ్యక్షత వహించారు. వై.రాధాకృష్ణ మాట్లాడుతూ బిజెపి పాలనలో ధరల పెరుగుదల, సిఎఎ, ఎన్ఆర్సి వంటి వాటికి వ్యతిరేకంగా అభ్యర్థి ఎం.రాధాకృష్ణతో కలిసి అనేక ఆందోళనలు చేశామని గుర్తు చేశారు. ఇటీవల బొప్పూడిలో జరిగిన ఎన్డిఎ కూటమి సభలో మాట్లాడిన మోడీ… రాష్ట్రానికి ఏం చేశారో చెప్పలేదని, ఏం చేస్తారో హామీ ఇవ్వలేదని విమర్శించారు. టిడిపి రాజకీయాల్లో నిలకడ లేదన్నారు. ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య బూతులు, రాళ్ల రాజకీయాలే నడుస్తున్నాయని, ప్రజల సమస్యలు మాట్లాడ్డం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రజల పక్షాన నిలబడే అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సిపిఐ ఏరియా కార్యదర్శి ఎన్.సుబ్బాయమ్మ, సిపిఎం పట్టణ కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు, రాష్ట్ర కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు సలాం, బాజీ, విజయనిర్మల, బాబురావు, టి.ప్రతాప్రెడ్డి మాట్లాడారు.