ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్ఎన్నికల ప్రవర్తన నియమావళిని పగడ్బందీగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఏలూరు రేంజ్ డిఐజి జివిజి.అశోక్ కుమార్ అన్నారు. గురువారం ఆయన కొవ్వూరు డిఎస్పి కార్యాలయం, టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లలో వార్షిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం అశోక్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు 6 జిల్లాల కలెక్టర్లు, ఎస్పిలతో సమన్వయం చేసుకుంటున్నట్టు చెప్పారు. ప్రతి జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియ మావళిపై శిక్షణా తరగతులు నిర్వహించినట్టు చెప్పారు. జిల్లాలో విఐపిలు, ప్రజాప్రతినిధులు పర్యటించినపుడు సెక్యూరిటీపరంగా బందోబస్తులు పకడ్బందీగా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. డిసెంబర్ నెల నుంచే ఎన్నికల షెడ్యూలు విడుదల కాకుండానే ఎన్ఫోర్స్మెంట్ అమలు ప్రక్రియ ప్రారంభించినట్టు చెప్పారు. ఆరు జిల్లాల పరిధిలో 1,842 నాన్ బెయిలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేసినట్టు చెప్పారు. ఐడి లిక్కర్, బెల్లం ఊట, ఎన్డిపిఎల్, టెట్రా ప్యాకెట్లు, డిపిఎల్ (గంజా), ఎన్డిపిఎస్ తదితరాలు చెందిన 7,489 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, 4,067 మందిని అరెస్ట్ చేశామని, రూ.15,53,74,279 విలువైన వాటిని సీజ్ చేశామన్నారు. ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు ప్రభావాన్ని తగ్గించడానికి దాడులు మరింత తీవ్రతరం చేసినట్టు చెప్పారు. ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ సరళిపై పోలీసు సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించామన్నారు. ఈ సమీక్షలో ఎస్పి పి.జగదీష్, డిఎస్పి కెసిహెచ్.రామారావు, టౌన్, రూరల్ సిఐలు వి.జగదీశ్వరరావు, పి.శ్రీనివాసరావు ఉన్నారు.