ప్రజాశక్తి – ఉండ్రాజవరం ప్రభుత్వ ప్లస్ 2 కో-ఎడ్ కళాశాలలో విద్యార్థులను చేర్పించాలని వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నట్టు హెచ్ఎం బి.సూర్యకాంతం తెలిపారు. మండలంలోని సత్యవాడ, జెడ్పి ఉన్నత పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం నూతనంగా కో ఎడ్యుకేషన్ కళాశాలను ఎంపిసి, సిఇసి గ్రూపులతో ఏర్పాటు చేస్తున్నట్టు ఆమె చెప్పారు. ఈ కళాశాలలో చేర్పించాల్సిందిగా సత్యవాడ, పరిసర గ్రామాల నుండి, పాఠశాలలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కలిసి, అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. క్లాస్ రూములు, అధ్యాపకులు అన్ని వసతులు కల్పించారన్నారు. గత విద్యా సంవత్సరం, ఉండ్రాజవరంలో ఏర్పాటు చేసిన మహిళా కళాశాలతో పాటు సత్యవాడలో ప్రారంభం కానున్న కో ఎడ్యుకేషన్ కళాశాలతో కలిపి మండలంలో రెండు ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. వీటితోపాటు రెండు ప్రైవేటు కళాశాలలు మండలంలో ఉన్నాయి. ప్రజలకు అవగాహన కల్పించేందుకు కరపత్రాలు, బ్యానర్లు, డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు.