కాంగ్రెస్‌ అభ్యర్థులు సృజన, లావణ్యలను గెలిపించాలి

ప్రజాశక్తి – కొయ్యలగూడెం

ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని సిపిఐ మండల కార్యదర్శి జమ్మి శ్రీనివాసరావు ఓటరులను అభ్యర్థించారు. మండలంలోని బోడిగూడెం గ్రామంలో సిపిఐ ఆధ్వర్యంలో జమ్మి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఇండియా వేదికతో పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలుపొందాలని అన్నారు. ప్రత్యేక హోదా కావాలన్నా రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావాలని తెలిపారు. తమ అమూల్యమైన ఓటును పోలవరం నియోజకవర్గం ఎంఎల్‌ఎ అభ్యర్థి దువ్వెల సృజనకు హస్తం గుర్తుపై, ఏలూరు పార్లమెంట్‌ అభ్యర్థిని కావూరి లావణ్యకు హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని శ్రీనివాసరావు బోడిగూడెం గ్రామ ప్రజలను గడపగడపకూ తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సింగవరపు అద్దయ్య, వి.సత్యనారాయణ, శ్రీను, ఎ.ప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️