ప్రజాశక్తి – కాకినాడ
ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లందరూ పాల్గొని తమ ఓటు వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ప్రముఖ న్యాయవాది సలార్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక పేర్రాజుపేట వద్ద గల గాంధీ విగ్రహానికి పూలమాలవేసి గాంధీ గుడి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓటర్ల చైతన్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం అనంతరం స్వాతంత్య్ర ఉద్యమ లక్ష్యాలను ఉపయోగించుకుని ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలను పూర్తి చేసుకున్నామన్నారు అయితే ప్రస్తుతం దేశ మార్కెట్లోకి అంతర్జాతీయ పెట్టుబడిదారులు ప్రవేశించి మెజారిటీ ప్రజల జీవన పద్ధతులను శాసించే స్థాయికి వచ్చాయన్నారు. ఈ తరుణంలో జరుగుతున్న ఎన్నికల్లో డబ్బు, మద్యం, మత్తు పదార్థాలతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి విజయం సాధించాలని చూస్తున్న స్వార్థపూరితమైన అభ్యర్థులను ఓడించేందుకు ప్రతీ ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కోఆర్డినేటర్ కె.సత్తిరాజు మాట్లాడుతూ గడిచిన నాలుగు రోజులుగా కాకినాడ నగరంలో గాంధీ గుడి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓటర్ల చైతన్య కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎపిఆర్పిఎ జిల్లా సహాయ కార్యదర్శి టిఎస్ఎన్.రెడ్డి, బి.సత్యనారాయణ, గుత్తి రామకృష్ణ, యుటిఎఫ్ నాయకులు ఆవాల హరి, జనవిజ్ఞాన వేదిక పట్టణ కార్యదర్శి కామాడీ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.