ప్రజాశక్తి-మండపేట : వారి సమస్యలు పరిష్కారం కోరుతూ పారిశుద్ధ కార్మికుల బిక్షాటన కార్యక్రమం చేపట్టారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సమస్యల పరిష్కారం కోరుతూ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారానికి నాటికి 10వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు కార్మిక నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వంతో కార్మిక సంఘ నాయకులు డిమాండ్ల పరిష్కారానికి పలుమార్లు చర్చలు జరిపినా అవి విఫలమయ్యాయన్నారు. నిత్యం పట్టణ ప్రజల ఆరోగ్య కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టి పట్టణ పరిశుభ్రత కోసం పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం వెనకడుగు వేయడం సరికాదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు జీతాలు ప్రభుత్వం పెంచాలన్నారు. కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని, సిఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్ ఈ ఎస్ ఐ, పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు కొమరపు నరేంద్ర కుమార్, బంగారు కొండ, లోవరాజు, విజయ్, సవరపు సరోజినీ, బంగారు అన్నవరం, మల్లవరపు సువార్త, మడికి హేమలత, సిహెచ్ వెంకటలక్ష్మి, భాను,
సన్యాసమ్మ తదితరులు పాల్గొన్నారు.