ఉద్యోగ విరమణ చేసిన హెడ్ కానిస్టేబుల్ను సన్మానించిన నగరం ఎస్ఐ
ప్రజాశక్తి-యంత్రాంగం
జిల్లాలో వివిధ శాఖల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన వారిని ఆదివారం పలువురు ఘనంగా సత్కరిచారు. వివరాలు ఇవి..మామిడికుదురు: విధినిర్వహణలో ఉద్యోగులు బాధ్యతాయుతంగా పని చేస్తే ప్రజల్లో మంచి గుర్తింపు పొందగలుగుతారని నగరం ఎస్ఐ సురేష్ అన్నారు నగరం పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ కుడుపూడి ఆదినారాయణమూర్తిని ఆదివారం మామిడికుదురులో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎస్ఐ సురేశ్ నగరం పోలీస్స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.ముమ్మిడివరం: విధి నిర్వహణలో అంకిత భావంతో చేసిన సేవలే గుర్తింపునిస్తాయని పలువురు పేర్కొన్నారు. మండలంలోని గేదెల్లంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన చేకూరి విశ్వేశ్వరరావును ఆదివారం ఘనంగా సత్కరించారు. స్థానిక పాఠశాల కమిటీ, ఉపాధ్యాయులు మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ చేసిన హెచ్ఎం విశ్వేశ్వరరావు ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా గ్రామంలోని పంచాయతీ కార్యాలయం నుంచి పాఠశాల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్ల బండిలో విశ్వేశ్వరరావును కూర్చోబెట్టి పూర్వపు విద్యార్థులు బండి కాడిని లాగుతూ పాఠశాల వరకు తీసుకువచ్చి ఉపాధ్యాయునిపై ఉన్న అభిమానాన్ని గౌరవాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థులకు అంకితభావంతో అందించిన సేవలను కొనియాడారు. గత సంవత్సరం జరిగిన పదో తరగతి పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించడంలో విశ్వేశ్వరరావు కషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కోలా బాబ్జి, గుద్దటి జమ్మి, గుద్దటి వీరాస్వామి నాయుడు, విద్యా కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామస్తులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.