ప్రజాశక్తి-అమలాపురం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల దళితులు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉందని కోనసీమ రైతు పరిరక్షణ సమన్వయ సమితి కోనసీమ విభాగం అధ్యక్షులు కె.సత్తిబాబు అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్ల రైతులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని కోనసీమ రైతు పరిరక్షణ సమన్వయ సమితి కో కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం అమలాపురంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 9/77 యాక్టు అమలులోకి తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పేద దళిత వర్గాలకు చెందిన బంజర భూములు లంక భూములు సొసైటీ భూములు తిరిగి పెత్తందారులు స్వాధీనం చేసుకునే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు హక్కులు కాపాడుకోవడం కోసం పోరాటమే శరణ్యమని రైతులు మేధావులు న్యాయవాదులు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో రైతులు భూములు కోల్పోయే ప్రమాదం ఉందని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడితేనే చట్టాన్ని రద్దు చేయడం లేదా మార్పు చేయడం చేస్తారన్నారు. భూ చట్టాలు, భూ సంస్కరణ చట్టాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పరిధిలోకి రాకుండా కేంద్ర ప్రభుత్వం ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ చట్టంతో భూ కబ్జాదారులకు పేద దళిత భూములను దోచిపెట్టే విధంగా ఉందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై పునరాలోచన చేయాలని కేంద్ర బిజెపి ప్రభుత్వం ఏ చట్టం తీసుకువచ్చినా దాన్ని సిఎం జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో అమలు చేయడం దారుణమన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాష్ట్రంలో అమలు చేయడానికి సిఎం జగన్ ప్రయత్నం చేయడం దారుణమన్నారు.