కొండయ్యను గెలిపించుకుందాం: ఎమ్మెల్సీ

ప్రజాశక్తి-చీరాల: రాష్ట్రంలో వైసిపి అరాచక పాలన రాజ్యం ఏలుతోందని, ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేస్తున్న జగన్‌ ప్రభుత్వాన్ని సాగనంపాలని ఎమ్మెల్సీ అనురాధ అన్నారు.శనివారం రాత్రి మండలంలోని ఈపురిపాలెం గ్రామంలో సీనియర్‌ నాయకురాలు డాక్టర్‌ సజ్జా హేమలత ఆధ్వర్యంలో గ్రామ ప్రజలతో ఆత్మీయ సమావేశాన్ని గుద్దంటి చంద్రమౌళి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజల విశ్వసిస్తున్నారని, సూపర్‌ సిక్స్‌ పథకాలతో ప్రజలకు మరింత చేరువ అయ్యారని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల అందరికీ సంక్షేమ పథకాలను అందిస్తూ విడుదల చేసిన మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తోందని అన్నారు. నిరుద్యోగ సమస్య పోవాలన్నా, పారిశ్రమికంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పెన్షన్లు, బీసీలకు రక్షణ చట్టం రావాలన్నా ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికలలో ప్రజలందరూ సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి టిడిపి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో గుర్రం వెంకటేశ్వర్లు అవ్వారు సాంబయ్య గంజి పురుషోత్తం, వినుకొండ జగదీష్‌, దుడ్డు రూపావతి, కమ్మనబోయిన రజిని ఉమామహేశ్వరరావు, సూరగాని బాలచంద్ర, సేలం దేవరాజు, ఎర్ర శివ నాగ మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

➡️