వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న కలెక్టర్
సమస్యాత్మక పోలింగ కేంద్రాల నివేదికలు ఇవ్వాలి
జిల్లా కలెక్టర్ డా కె.శ్రీనివాసులు
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్
రాబోయే ఎన్నికలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల (వలరనబుల్ మ్యాపింగ్) నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ కె.శ్రీనివాసులు రిటర్నింగ్ అధికారులను, పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల సమర్థవంత నిర్వహణపై నోడల్ అధికారులు, ఆర్డిఒలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఒలు, పోలీస్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకొని వలరనబుల్ మ్యాపింగ్ రిపోర్టు-2ను సిద్ధం చేసి పంపాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని రకాల బృందాలకు ఈ నెలాఖరులోగా అన్ని శిక్షణలు పూర్తి చేయాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న అన్ని రకాల ఫారంలను వెంటనే పూర్తి చేసి అర్హులైన వారిని ఓటర్ల జాబితాలో నమోదు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అలాగే వీడియో వ్యూయింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సెర్వెలెన్స్ తదితర టీమ్లను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఆయా బృందాలు నిర్వహించాల్సిన విధులపై సమగ్ర అవగాహన కలిగి ఉండేలా చర్యలు తీసుకో0వాలని ఆదేశించారు.