ఉపశమనం కాదు.. ఉపద్రవమే..

May 12,2024 23:54

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : వేసవిలో కొద్ది సేపటికే గొంతెండుతుంది. ఎండకు వెళ్లి అలిసి నీడకు రాగానే వెంటనే ఫ్రిజ్‌ తీసి గటగటమంటూ చల్లని నీటిని తాగేసి ఉపశమనం కలిగినట్లు అనిపించి కాస్త సాంత్వన పొందుతాం. కానీ చల్లని నీటితో ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫ్రిజ్‌ వాటర్‌ తాగిన వారిలో ఎక్కువ శాతం మంది గొంతు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. చిన్న పిల్లల్లో ఈ పరిస్థితి మరింత ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. కూలింగ్‌ వాటర్‌ తాగడం ఫ్యాషన్‌గా భావిస్తున్న ఈ రోజుల్లో అది ఆరోగ్యానికి చేటు చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ప్రస్తుతం ఎండ వేడిమిని శరీరం తట్టుకోవాలంటే రోజుకు కనీసం 5 నుండి 6 లీటర్ల నీరు తాగాలి. శరీరంలోని కాలుష్యాన్ని కడిగేందుకు నీరు ఎంతో ఉపకారం చేస్తుందని, తగిన జాగ్రత్తలు పాటించకుంటే అదే నీరు మన ప్రాణాల మీదకు తెస్తుందని, ఆరోగ్యాన్ని దెబ్బతీసి బిక్కిరి చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఫ్రిజ్‌ వాటర్‌కు దూరంగా ఉండాలంటున్నారు. ఫ్రిజ్‌ నీరు నేరుగా గొంతు గొంతులోని భాగాలను ప్రభావితం చేస్తుంది. గుండె, ఉపిరితిత్తులు, రక్తనాళాలకూ ముప్పు తెస్తుంది. గతేడాది ఈ సీజన్‌లో గొంతు వ్యాధులు గణనీయంగా పెరిగాయని, అతి చల్లని నీరు తాగడమే ఇందుకు కారణమని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధులకు గురయ్యే వారిలో ఎక్కువ మంది చిన్న పిల్లలుంటున్నారు. ఆస్పత్రులకు వచ్చే ప్రతి నలుగురిలో ముగ్గురి పిల్లలు కూలింగ్‌ వాటర్‌ తాగి సమస్యలు కొని తెచ్చుకునే వారే. వీరంతా 14 ఏళ్లలోపు చిన్నారులే, వీటితో పాటు వేసవిలో వివిధ ఫ్లేవర్లలో లభించే ఐస్క్రీమ్లు తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. గొంతులోని పొరలు చల్లదనం బారిన పడి రోగ నిరోధక శక్తి కోల్పోతాయి. ఈ కారణంగా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. గాలిలోని రైనో, ఎడినో, ఇన్ఫ్లూయింజాలాంటి బ్యాక్టీరి యాలు, వైరస్లు గొంతుపై ప్రభావం చూపి స్తాయి. జ్వరం రావడం, గొంతు మంట, బొంగురు పోవడం, వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. చల్లని నీళ్లు తాగితే దగ్గు కూడా వస్తుంది. గొంతు ఇన్ఫెక్షన్ల కారణంగా ఉపిరి తిత్తులపై ప్రభావం పడి న్యూమోనియా వచ్చే అవకాశం ఉంది. ఒళ్లు, కీళ్ల నొప్పల సమస్య ఏర్పడుతుంది. గుండె, కిడ్నీలకు ఇన్‌ఫెక్షన్‌ చేరే ప్రమాదం ఉంది.

రక్తనాళాలు బిగుసుకుపోతాయి
డాక్టర్‌ పచ్చవ విజేత, పిల్లల వైద్య నిపుణులు.
3-12 ఏళ్ల చిన్నారుల గొంతుల్లో టాన్సిల్స్‌, ఎడినాయిడ్‌ గ్రంధులు అతి త్వరంగా ఇన్‌ఫెక్షన్‌కు గురవుతుంటాయి. వీరిని చల్లని నీటికి దూరంగా ఉంచాలి. జ్వరం సమయంలో భోజనం చేసేందుకు గొంతు సహకరించదు. ఒక గ్లాస్‌ చల్లని నీళ్లు తాగగానే గొంతులోని రక్తనాళాలు బాగా బిగుసుకు పోతాయి. కొద్దిసేపటికి గొంతులోని రక్తనాళాలు ఉబ్బి గొంతు గోడలకుండే పోరలు దెబ్బతింటాయి. పిలలకు కాచి చల్లార్చిన నీళ్లు ఇవ్వాలి. ఫ్రిజ్‌నీరు, ఐస్క్రీములకు దూరంగా ఉంచాలి. పెరుగు, పండ్లు ఫ్రిజ్లో నుండి తీసిన వెంటనే కాకుండా కాసేపు ఉంచి తగిన ఉష్ణోగ్రతకు చేరాక తినాలి.

➡️