ప్రజాశక్తి-విజయనగరం కోట : ఇండియా వేదిక బలపర్చిన కాంగ్రెస్ విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి బొబ్బిలి శ్రీనును గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్, వామపక్షాల ఆధ్వర్యాన బుధవారం నగరరలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక మయూర జంక్షన్ వద్ద నుండి ఎల్ఐసి ఆఫీస్, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా ర్యాలీ సాగింది. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని నినాదాలు చేశారు. అనంతరం ఒక ప్రైవేటు కల్యాణ మండపంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.కామేశ్వరరావు మాట్లాడారు. దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఇప్పటికే దేశంలో నరేంద్ర మోడీ , రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాయన్నారు. దేశంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తరువాత 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా ఏర్పాటు చేసి కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేశారన్నారు. ఈ నేపథ్యంలో బొబ్బిలి శ్రీనుతోపాటు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అభ్యర్థి బొబ్బిలి శ్రీను మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బిజెపి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఎన్నడూ లేని విధంగా విపరీతమైన ధరలు పెరిగాయని తెలిపారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే దశల వారీ సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని కొనసాగిస్తానని నమ్మించి మోసం చేశాడన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తన మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదాపైనే అన్నారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు బి.అశోక్, అప్పారావు, ముల్లు నరసింహులు, సివిల్ సప్లై కార్మికులు పాల్గొన్నారు.