ప్రజాశక్తి -ఉక్కునగరం : గాజువాక నియోజకవర్గం పరిధిలో సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి మరడాన జగ్గునాయుడు ప్రచారానికి విశేష స్పందన లభిస్తోంది. గాజువాక నియోజకవర్గ పరిధి అగనంపూడి పరిసర ప్రాంతాలలో బుధవారం ఎన్నికల ప్రచారాన్ని జగ్గునాయుడు నిర్వహించారు. అగనంపూడి, కొండయ్యవలస, పూడిమడక, డొంకాడ, కొత్తూరు తదితర ప్రాంతాలలో పర్యటించారు. స్టీల్ప్లాంట్ ఉద్యోగులు, నిర్వాసితుల కుటుంబాలతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ, వేలాది మంది నిర్వాసితులు ఇప్పటికీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, వారికి ఎలాంటి న్యాయం చేయకుండా స్టీల్ప్లాంట్ను ప్రైవేటుపరం చేయాలని చూస్తున్న కుట్రలను అడ్డుకోవటానికి బలమైన పార్టీ కావాలన్నారు. విశాఖపట్నం స్టీల్ప్లాంట్ కోసం చిత్తశుద్ధితో మూడేళ్లుగా పోరాడుతున్న పార్టీ సిపిఎం అని గుర్తు చేశారు. గంగవరం పోర్టు కాలుష్యం, అగనంపూడి టోల్గేట్ సమస్యను, స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో గళం విప్తే సత్తా సిపిఎం అభ్యర్థికి మాత్రమే ఉంటుందని చెప్పారు. స్టీల్ప్లాంట్ పరిరక్షణకు పాటుపడుతున్న ప్రతి కార్మికుడు, నిర్వాసితుడు సిపిఎం అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి, స్థానికులు మరిడయ్య, సిపిఎం నాయకులు ఎన్.రామారావు పాల్గొన్నారు.