విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ‘చిలకం’
ధర్మవరం టౌన్ : జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిప్రాయాల మేరకు తాము నడుచుకుంటామనిజనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధర్మవరంలో వైసీపీ అరాచకాలను, దౌర్జన్యాలను, దాడులను ఐదేళ్లగా ఎదుర్కొన్నామన్నారు. ఇందులో భాగంగా సేవ్ ధర్మవరం కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళ్లి అనేక హామీలిచ్చామన్నారు. వాటిని నెరవేర్చలేకపోతున్నందుకు ధర్మవరం ప్రజలు తమను క్షమించాలన్నారు. అదేవిధంగా మిత్రపక్ష అభ్యర్థిగా సత్యకుమార్యాదవ్ను నియమించినందుకు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటుచేసుకుని కార్యాచరణతో ప్రజల ముందుకు వెళ్లి వారి అభిప్రాయాలను తెలుసుకుని వాటిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. అదేవిధంగా సత్యకుమార్యాదవ్కు కూడా తెలియజేస్తానన్నారు. తమ అధినేత పవన్కళ్యాణ్ నిర్ణయం మేరకు తమ నిర్ణయాన్ని తెలియజేస్తామన్నారు.గత 20 ఏళ్ల నుంచి ప్రతిసారి అభ్యర్థి విషయంలో ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. ధర్మవరాన్ని కాపాడుకోవాలని కంకణం కట్టుకున్నామని కానీ కొందరి ఆలోచనల వల్ల పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ను ప్రకటించారని అన్నారు. ధర్మవరం పరిస్థితుల గురించి సత్య కుమార్ యాదవ్ తో మాట్లాడుతానన్నారు. ఆయన ఎన్నికలలో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.