వృద్ధురాలితో మాట్లాడుతున్న దగ్గుపాటి ప్రసాద్
అనంతపురం కలెక్టరేట్ : మరోసారి అబద్ధపు హామీలతో ప్రజలకు ముందుకు వస్తున్న జగన్ రెడ్డిని ప్రజలు నమ్మరని, వైసిపి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజలను వంచించేలా ఉందని టిడిపి అనంతపురం అర్భన్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయాన్నే రాజీవ్ చిల్డ్రన్స్ పార్క్లో వాకర్స్తో కరచాలనం అభివాదం చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఇండోర్ స్టేడియంలో షటిల్ ఆడుతూ అందరిని ఆకట్టుకున్నారు. స్టేడియం పార్కుల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కనీసం తాగునీరు కూడా లేకుండా చేశారని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఎక్కడా పార్కులు, స్టేడియంలలో అదనంగా చేసింది ఏమీ లేదన్నారు. అనంతరం రూరల్ పంచాయతీ పరిధిలోని టీవీ టవర్ వద్ద రామకృష్ణ కాలనీలో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి బాబు సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. స్థానికులు పెద్ద ఎత్తున సమస్యల్ని దగ్గుపాటి దృష్టికి తీసుకొచ్చారు. ఈసందర్భంగా దగ్గుపాటి మాట్లాడుతూ అర్బన్ నియోజకవర్గంలో కనీసం డ్రైనేజీల వంటి చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించలేని దుస్థితిలో ఎమ్మెల్యే ఉన్నారని విమర్శించారు. మరోవైపు జగన్ విడుదల చేసిన మ్యానిఫెస్టో పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత అనంతపురంలో ఇండోర్ స్టేడియంలు, పార్కులు అభివృద్ధి చేస్తామని దగ్గుపాటి హామీ ఇచ్చారు.