ఆర్బికెను ప్రారంభిస్తున్న స్పీకర్ సీతారాం
శాసనసభ స్పీకర్ సీతారాం
ప్రజాశక్తి- ఆమదాలవలస
అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలోని కనుగులవలసలో రూ.54 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, నాడు-నేడు పాఠశాల భవనాలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విస్తృత సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని అన్నారు. గతంలో మాదిరి ఎరువులు, విత్తనాలు మండల కేంద్రాలకు పరుగులు తీయకుండా గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా సేవలు రైతుల ముంగిటకు ఈ ప్రభుత్వం తీసుకువచ్చిందని అన్నారు. పంటలకు మెరుగైన మద్దతు ధర కల్పించి ఆర్బికెల ద్వారా కొనుగోలు చేస్తున్నామని అన్నారు. జగన్మోహన్రెడ్డి రైతు పక్షపాతి అని అన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చాక నాడు-నేడు కార్యక్రమంతో పాఠశాలల భవనాలు సర్వాంగసుందరంగా రూపుదిద్దుకున్నాయని అన్నారు. విద్యా విధానంలో పెను మార్పులు తీసుకువచ్చి విద్యకు అధిక ప్రాధాన్యతను కల్పిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ బొడ్డేపల్లి నారాయణరావు, ఎంపిటిసి పొన్నాడ అనసూయమ్మ, మండల సచివాలయాల కో-ఆర్డినేటర్ బొడ్డేపల్లి నిరంజన్ బాబు, అనిల్కుమార్, పిఎసిఎస్ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, సమగ్ర శిక్షా అభియాన్ ఎపిసి రోణంకి జయప్రకాష్, వ్యవసాయశాఖ ఎడి బగ్గు రజిని, ఎంపిడిఒ ఎస్.వాసుదేవరావు, మండల ఎఒ మెట్ట మోహనరావు, ఎంఇఒలు జి.రాజేంద్రప్రసాద్, టింగరాజు పాల్గొన్నారు.