మాట్లాడుతున్న కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్
డబ్బు, మద్యం అక్రమ రవాణాపై దృష్టి
కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్ వచ్చే సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆయన ఛాంబరులో పోలీస్, వాణిజ్య పన్నులశాఖ, ఎక్సైజ్, ఆదాయపు పన్ను శాఖల అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో కట్టుదిట్టమైన నిఘా ఉండాలన్నారు. ఎన్నికల నిర్బంధ నిర్వహణ వ్యవస్థని సమర్ధవంతంగా అమలు చేయాలన్నారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ జిల్లాలో సున్నితమైన ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించేలా అధికారులు అన్నివిధాలా సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలు ఒడిశా అనుకొని ఉండడంతో అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టుల నిర్వహణపై దృష్టిసారించాలన్నారు. డబ్బు, మద్యం, మాదకద్రవ్యాలు అక్రమ రవాణా జరగకుండా చూడాలన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో అక్రమ రవాణా జరిగే ప్రమాదం ఉందని, అందువల్ల ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ప్రధానంగా రాత్రి వేళ గసీ తో పాటు తనికీలు చేపట్టాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని చెక్పోస్టుల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఎంసిసి, ఎఫ్ఎస్టి, ఎస్ఎస్టి, విఎస్టీ, తదితర అన్ని రకాల టీమ్లు అప్రమత్తమవుతాయన్నారు. చెక్పోస్టుల్లో సీజ్ చేసిన వివరాలను రోజూ నివేదించాలన్నారు. పోలీస్, ఇన్కమ్ ట్యాక్స్, ఎక్సైజ్ శాఖ, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. డబ్బు, మద్యం, డ్రగ్స్, ఇతర యాంటీ సోషల్ ఐటమ్స్ అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముందస్తుగానే అక్రమ రవాణా జరిగే అవకాశాలున్న నేపథ్యంలో నిత్యం అప్రమత్తంగా ఉంటూ అక్రమ రవాణాని అరికట్టాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, జిల్లా అటవీ శాఖా అధికారిణి నిషాకుమారి, డిఆర్ఒ ఎం.గణపతిరావు, అడిషనల్ ఎస్పి ప్రేమకాజుల్, లీడ్ బ్యాంకు మేనేజర్ సూర్యకిరణ్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నాగరాజు, డిటిఒ చంద్రశేఖర్రెడ్డి, సి సెక్షన్ సూపరింటెండెంట్ కూర్మారావు, చక్రవర్తి పాల్గొన్నారు.