వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
- కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి – గార
ప్రజల ఆరోగ్య సమస్యలకు వారి ఇంటి ముంగిట్లోనే పరిష్కారాన్ని, వైద్య సేవల్ని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష పేరిట ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మండలంలోని అంపోలు-3 సచివాలయ పరిధిలోని వెల్నెస్ సెంటర్లో జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది నవంబరు, డిసెంబరులో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు. రోగులకు అవసరమైన సందర్భాల్లో నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసి ఉచిత వైద్య సేవలు అందిస్తారని, ఈ బాధ్యతను పూర్తిగా ఫ్యామిలీ డాక్టర్, సిహెచ్ఒలు, ఎఎన్ఎంలకు అప్పగించామని వివరించారు. ఆయా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నిర్వహించే రెండో దశలో జిల్లాలోని దీర్ఘకాలిక రోగులు, గర్భిణులు, బాలింతలతో పాటు ప్రసవానంతర శిశు సంరక్షణ సేవలు, అన్ని వయసుల వారి ఆరోగ్య సమస్యలకు వైద్య సేవలను అందించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిసిఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, అగ్రి మిషన్ సభ్యులు గొండు రఘురాం, వైద్యారోగ్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.