సేవా పతకాన్ని అందుకుంటున్న దొరబాబు
ప్రజాశక్తి- సోంపేట
ఇటీవల శ్రీనగర్ బారాముల్లా జిల్లా, ఆదిపురాలో చేపట్టిన 32 రాష్ట్రీయ రైపైల్ ఆపరేషన్లో పాల్గొని, ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడి ఇద్దరు పాకిస్తానీ ఉగ్రవాదులను అంతమొందించారు. ఇందులో సోంపేట మండలం మామిడిపల్లి పంచాయతీ చిన్న మామిడిపల్లికి చెందిన ఆర్మీ జవాన్ బొడ్డు దొరబాబుకు అతివిశిష్టమైన సేవా మెడల్, సేవా మెడల్ను లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చేతుల మీదుగా అందుకున్నారు. 32, రాష్ట్రీయ రైఫెల్ ఆపరేషన్లో స్థానిక కాశ్మీర్ పోలీసులతో కలిసి పాల్గొన్న దొరబాబు, డ్రోన్ సాయంతో ఉస్మాన, ఉమర్ అనే ఇద్దరు పాకిస్తానీ ఉగ్రవాదుల ఆచూకీ తెలుసుకున్నారు. 54 గంటలు పాటు ప్రాణాలు ఎదురొడ్డి పోరాటం చేసి వాళ్లను హతమార్చడంలో ప్రముఖ పాత్ర వహించాడు. దొరబాబు తండ్రి బొడ్డు పురుషోత్తం, ఒక సాధారణ రైతు. దొరబాబుకు విశిష్ట సేవ పతకాలు రావడంపై గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు.