3 వేల మందితో బందోబస్తు
పోలింగ్ రోజున 144 సెక్షన్
పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరంగా ఉండాలి
ఎస్పి దీపిక
ప్రజాశక్తి-విజయనగరం కోట : ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పి ఎం.దీపిక తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల సందర్భంగా చేపట్టాల్సిన చర్యలపై పోలీసు అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంత యుతంగా నిర్వహిం చేందుకు గ్రామాలను పలుమార్లు సందర్శించి, సమావేశాలు నిర్వహించి వివాదాలకు దూరంగా ఉండాలని సూచించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1015 గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి, ఎన్నికల నిబంధనలు, పాటించాల్సిన విధి, విధానాలు గురించి అవగాహన కల్పించామన్నారు. కేంద్ర పోలీసు బలగాలు, స్థానిక పోలీసులు, ఉన్నతాధికారులు ఇప్పటికే 149 గ్రామాలను సందర్శించి, ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహించి, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకొనే విధంగా భరోసా కల్పించామన్నారు. పోలింగు అనంతరం సంబంధిత పోలింగు కేంద్రాల నుంచి ఇవిఎంలను, ఎన్నికల మెటీరియల్ను సురక్షితంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా జెఎన్టియు, లెండీ ఇంజినీరింగ్ ళాశాల్లోని స్ట్రాంగ్ రూములకు చేర్చాలన్నారు. ఇవిఎంలను స్ట్రాంగు రూంలకు తరలించే క్రమంలో ఎటువంటి ట్రాఫిక్ అవాంతరాలు ఏర్పడకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోలింగు రోజున పార్టీ అభ్యర్ధులు పాటించాల్సిన విధి, విధానాలు గురించి అవగాహన కల్పించామన్నారు. పోలింగు కేంద్రాలకు 200మీటర్లు దూరంలో మాత్రమే పార్టీ కార్యకర్తలు ఉండేలా ఎటువంటి పార్టీ జెండాలు, గుర్తులు ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. పోలింగు రోజున 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా ఇద్దరు కంటే ఎక్కువ వ్యక్తులు గుంపులుగా ఉండకుండా చూడాలన్నారు. పోలింగు కేంద్రాల వద్ద 100మీటర్ల పరిధిలో ఓటు వేసే వ్యక్తులు మినహా ఇంకెవ్వరూ ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు.గ్రామాల్లో ఎటువంటి అల్లర్లు, వివాదాలు చెలరేగకుండా గస్తీ, పెట్రోలింగు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. సమావేశంలో విజయనగరం డిఎస్పి ఆర్.గోవిందరావు, బొబ్బిలి డిఎస్పి పి.శ్రీనివాసరావు, సిఐలు కెకెవి విజయనాధ్, ఇ.నర్సింహమూర్తి, ఎం.శ్రీనివాసరావు, రవికుమార్, ఎన్.వి.ప్రభాకర్, బి.వెంకటరావు, కె.రామారావు తదితరులు పాల్గొన్నారు.