డ్రోన్ ఎగుర వేయడంపై స్పందించిన సివిఎస్ఓప్రజాశక్తి- తిరుమల తిరుమలలో కలకలం రేపిన డ్రోన్ కెమెరా వీడియో చిత్రీకరణ ఆంశంపై టీటీడీ స్పందించింది. హర్యానాకు చెందిన ఓ జంట తిరుమల నుండి తిరుపతికి ప్రయాణించే డౌన్ ఘాట్ రోడ్డులో 53వ మలుపు వద్ద నిల్చుని డ్రోన్ను ఎగురవేసి వీడియో చిత్రీకరిస్తూ మీడియా ప్రతినిధి కంట్లో పడ్డాడు. మూడంచెల భద్రతా తనిఖీలను దాటుకొని, సదరు భక్తుడు తిరుమలకు డ్రోన్ కెమెరా తీసుకురావడంపై విజిలెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా మీడియా ప్రసారాల ద్వారా సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు డ్రోన్ ఎగురవేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్దగల డ్రోన్ను సీజ్ చేశారు. భారత భద్రతాదళానికి సంబంధించిన దినేష్ ఉద్దేశపూర్వకంగా డ్రోన్ కెమెరా ఎగర వేయలేదని, దినేష్ రెండు నెలలుగా సెలవులు మీద దక్షిణ భారత దేశాన్ని పర్యటిస్తున్నారని తిరుమల నిబంధనలు అతనికి తెలియదని టీటీడీ ముఖ్యనిఘా మరియు భద్రత అధికారి నరసింహ కిషోర్ తెలిపారు. మొదటి ఘాట్ రోడ్డులో 53వ మలుపు వద్ద ఎగరవేసిన డ్రోన్ కెమెరాను సీజ్ చేశామన్నారు. మూడు గంటల పాటు దినేష్ను విచారించామన్నారు. బ్యాటరీతో నడిచే పూర్తి ప్లాస్టిక్ బాడీకి సంబంధించిన డ్రోన్ కెమెరా కావడంతో ఎలాంటి ప్రమాదం లేదన్నారు.
![డ్రోన్ ఎగుర వేయడంపై స్పందించిన సివిఎస్ఓ](https://prajasakti.com/wp-content/uploads/2024/01/888888888888800000000000000.jpg)