దోబీఘాట్లో శిథిలావస్థలో విద్యుత్ స్తంభంపది నెలలుగా పట్టించుకోని విద్యుత్ శాఖ ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)రజకుల సౌకర్యార్ధం దోబీఘాట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయగా 2002లో అప్పటి ప్రభుత్వం చెన్నాయగుంటలో ఎకరా స్థలం కేటాయించింది. రజకులంతా ఉమ్మడిగా విరాళాలు వసూలు చేసుకుని చుట్టూ ప్రహరీ కట్టుకున్నారు. విద్యుత్ కనెక్షన్ తీసుకున్నారు. అయితే కాలక్రమంలో దోబీఘాట్ వద్ద ఉన్న విద్యుత్ స్తంభం శిథిలావస్థకు చేరుకుంది. పది నెలలుగా మంగళం సబ్స్టేషన్ విద్యుత్ శాఖ ఎఇ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని శ్రీ వీరభద్రస్వామి రజక వృత్తిదారుల సహకార సంఘం అధ్యక్షులు నిమ్మనపల్లి మునిరత్నం ఆరోపించారు. రజకులు బట్టలు ఉతికే సమయంలో ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఇటీవల అర్ధరాత్రి పెద్దఎత్తున గాలులు రావడంతో విద్యుత్ తీగ తెగి దోబీఘాట్ నేలపై పడింది. గమనించిన కమిటీ నాయకులు ఎఇ దృష్టికి మరోసారి తీసుకెళ్లారు. అయినా స్పందన లేకపోవడంతో మీడియా దృష్టికి తీసుకొచ్చారు. విద్యుత్ స్తంభాన్ని మార్పుచేసి, తీగలను సరిజేయాలని డిమాండ్ చేస్తున్నారు.