ఆసక్తి చూపిన ఓటర్లు జిల్లాలో పెరిగిన ఓటింగ్ శాతంప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్ చిత్తూరు జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు ఆసక్తి చూపారు. పోలింగ్ రోజైన సోమవారం ఉదయం ఆరు గంటల నుండీ ఓట్లు వేసేందుకు క్యూకట్టారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపించింది. మండుటెండల్లోనూ వృద్ధులు, మహిళలు, విభిన్న ప్రతిభావంతులు ఓటు వేసేందుకు వచ్చారు. ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందు ఓటర్లకు ఆసక్తి చూపడంతో జిల్లాలో ఓటింగ్ శాతం పెరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాలో 55.4 శాతం పోలింగ్ శాతం నమోదైంది. మహిళా ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద మహిళా ఓటర్లు బారులుతీరి కనిపించారు. సాయంత్రం ఐదు గంటలకు అధికారికంగా చిత్తూరు పార్లమెంట్ 74.93, పుంగనూరు 74.09, నగరి 76.81, జీడి నెల్లూరు 79.90, చిత్తూరు అసెంబ్లీ 74.75, పూతలపట్టు 77.17, పలమనేరు 72.33, కుప్పం 75.78 శాతం ఓట్లు పోలైయ్యాయి. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 75.67శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. సాయత్రం ఆరు గంటల వరకు ఓటర్లను పోలింగ్ బూత్ల్లోకి అనుమతించారు. క్యూలైన్లో ఉన్న ఓటర్లు ఓటు వేసి అవకాశం కల్పించారు. ఎంత సమయమైనా సాయత్రం ఆరు గంటలలోపు పోలింగ్ బూత్లోకి వచ్చి క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఆరు గంటల తరువాత కూడా జిల్లాలోని అనేక పోలింగ్ బూత్లో ఓటర్లు క్యూలైన్లల్లో నిలబడ్డారు. జిల్లాలోని ఏడు నియోజవర్గాలో 15,65,911 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 7,76,154, మహిళాఓటర్లు 7,93,682 మంది కాగా పుంగనూరు 2,38,868, నగరి 2,02,374, జీడీ నెల్లూరు 2,04,949, చిత్తూరు 2,02,850, పూతలపట్టు 2,20,999, పలమనేరు 2,67,896, కుప్పం 2,25,775 మంది ఓటర్లున్నారు. చిత్తూరు నియోజకవర్గం ప్రశాంత్ నగర్ 142 పోలింగ్ కేంద్రంలో 1,471 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 685, మహిళలు 782 మంది, ట్రాన్స్జెండర్స్ ముగ్గురు. సోమవారం జరిగిన పోలింగ్లో 555 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈపోలింగ్ బూత్లో పురుషుల కంటే అత్యధికంగా మహిళా ఓట్లు నమోదయ్యాయి.