ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సిఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు మరిచి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను మోసం చేశారని, ఇచ్చిన హామీని అమలు చేయకపోతే తగిన గుణపాఠం చెబుతామని సమగ్ర శిక్ష ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ జెఎసి రాష్ట్ర అధ్యక్షులు బి.కాంతారావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వీరు చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి ఆరో రోజుకు చేరుకుంది. కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేసి, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్నారు. యంటియస్ అమలు చేసి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి నెలా 1వ తేదీకి వేతనాలు చెల్లించి, వార్షిక బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలని, గ్రాట్యుటీ, 20లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రెగ్యులరైజేషన్, వేతనాల పెంపు, తక్షణమే బకాయిల చెల్లింపు తదితర సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించటంతో సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సమ్మె చేయాల్సి వస్తుందన్నారు. ఈ ధర్నాలో రాష్ట్ర కార్యదర్శి గురువులు ఉద్యోగులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/samagra-siksha-3.jpg)