ప్రజాశక్తి – వీరవాసరం
వచ్చే ఎన్నికల్లో వైసిపి కార్యకర్తలు అభ్యర్థులుగా భావించి తన విజయానికి కృషి చేయాలని ఎంఎల్ఎ, భీమవరం వైసిపి అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ అన్నారు. వైసిపి కార్యకర్తల సమావేశాలను గురువారం పలు గ్రామాల్లో నిర్వహించారు. నేలపోగుల, మడుగుపోలవరం, ఉత్తరపాలెం, నవుడూరు, అండలూరు, తోలేరు, బిజిపాలెం, పంజావేమవరం గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను గ్రంధి శ్రీనివాస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేశాం.. ఓట్లు వారే వేస్తారనే అతి విశ్వాసం పనికిరాదన్నారు. మూడు పార్టీలు కలిసిన ప్రత్యర్థిని మనం ఎదుర్కోవాల్సి ఉందన్నారు. మరోసారి జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఆయన వెంటన ఎఎంసి ఛైర్మన్ కోటిపల్లి బాబు, వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ గొలగాని సత్యనారాయణ, ఆయా గ్రామాల నాయకులు, వర్మ, మానుకొండ ప్రదీప్కుమార్ ఉన్నారు.