అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలి

ఎంఎల్‌ఎ పితాని సత్యనారాయణ

ప్రజాశక్తి – ఆచంట

అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆచంట నియోజకవర్గ ఎంఎల్‌ఎ పితాని సత్యనారాయణ అన్నారు. మండలంలోని వల్లూరు సెక్టార్‌ అంగన్వాడీ కార్యకర్తలు శనివారం పితానిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పితాని మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు, బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం నెలలో 25 రోజులపాటు అందించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధి పొందుతున్న బాలింతలు గర్భిణీ స్త్రీలు, చిన్నారుల రికార్డులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమకు తెలియపరచాలని ఆయన సూచించారు. ఎవరైనా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు అనిశెట్టి పద్మావతి, బి.కమల, వైబిటి సుందరి ఉన్నారు.

➡️