ఎంఎల్ఎ బొలిశెట్టి
ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం
తమ న్యాయమైన కోరికల కోసం గత ప్రభుత్వంలో సమ్మె చేసిన అంగన్వాడీలకు న్యాయం చేస్తామని తాడేపల్లిగూడెం ఎంఎల్ఎ బొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. అంగన్వాడీ సంఘ నాయకులు శనివారం ఎంఎల్ఎ బొలిశెట్టి శ్రీనివాసును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో చిన్నారులకు విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తూ గర్భిణులు, బాలింతల ఆరోగ్యం కోసం నిరంతరం పాటుపడుతున్న అంగన్వాడీలకు తగిన గుర్తింపు ఉంటుందని, ప్రభుత్వం దృష్టికి అంగన్వాడీ సమస్యలను తీసుకువెళ్తామన్నారు. రాష్ట్రం ఆర్థికంగా వెనకబాటుతనంగా ఉన్న కారణంగా న్యాయం చేసేందుకు కొంచెం సమయం పట్టినా.. అంగన్వాడీలు ప్రజా సేవలో ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సంఘ నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.