ప్రజాశక్తి-బబ్బిలి (విజయనగరం) : రాజకీయ లబ్ది కోసం సామాజిక పింఛన్దారులతో వైసీపీ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బేబినాయన అన్నారు. కోటలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ … వైసీపీ ప్రభుత్వం పేదల జీవితాలు, సామాజిక పింఛన్ దారులతో చెలగాటం ఆడుతుందని విమర్శించారు. రాజకీయ లబ్ది కోసం పింఛన్ల పంపిణీని టీడీపీ అడ్డుకుందని వైసీపీ నేతలు గ్లోబల్ ప్రచారం చేస్తున్నారన్నారు. చంద్రబాబు వలనే పింఛన్లు పంపిణీ ఆగిపోయిందని తప్పుడు ప్రచారం చేయడం అన్యాయమన్నారు. వాలంటీర్ వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకం కాదన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. రాజకీయాలకు వాలంటీర్లను వాడుకోవడానికి టీడీపీ వ్యతిరేకమని చెప్పారు. రాష్ట్రంలో పింఛన్దారులకు చెల్లించాల్సిన రూ.13వేల కోట్లు వైసీపీ కాంట్రాక్టర్లకు చెల్లించారని విమర్శించారు. ఎన్నికల కోడ్ వుంటుండగా కాంట్రాక్టర్లకు పింఛన్ల సొమ్ము ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్షా 35వేల మంది సచివాలయ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర ఉద్యోగులు ఉన్నారన్నారని, వీరితో ఎందుకు పింఛన్లు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. పేద ప్రజలను ఇబ్బందులు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూడడం సిగ్గు చేటన్నారు. పింఛన్లు ఇంటింటికి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 5లోగ పింఛన్లు ఇంటింటికి పంపిణీ చేయాలన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే పింఛన్ రూ.4వేలు ఇంటింటికి పింఛన్ ఇస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు.