కొత్త మలుపుల్లో కేంద్ర రాష్ట్ర రాజకీయాలు

Jun 30,2024 04:45 #editpage

ఎన్నికలు ముగిసి కొత్త సభలు కొలువు తీరిన సందర్భం. ఎ.పి శాసనసభ సభ్యుల ప్రమాణాలతో వాయిదా పడగా పార్లమెంటు ఉభయ సభలు వేడివేడిగా నడుస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాల తొలి అడుగులు వాటి పని తీరు ఎలా వుండబోయేది సంకేత ప్రాయంగా చెబుతున్నాయి. స్వంత మెజార్టీ కోల్పోయి మిశ్రమ సర్కారుగా మారినప్పటికీ మోడీ ప్రభుత్వం మౌలికంగా హిందూత్వ కార్పొరేట్‌ ఏకపక్ష నమూనాలోనే నడవబోతుందని స్పష్టమై పోతున్నది. గత రెండు పర్యాయాలు కాంగ్రెస్‌ కోరినా ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నిరాకరించిన స్పీకర్‌ ఈసారి అనివార్యంగా ప్రజల తీర్పుతోనే రాహుల్‌ గాంధీని ప్రతిపక్ష నేతగా ప్రకటించాల్సి వచ్చింది. అయితే దీటైన ప్రతిపక్ష వేదికగా ‘ఇండియా’ వున్నా ప్రజాస్వామ్య స్ఫూర్తితో వ్యవహరించే ప్రసక్తి లేదని లోక్‌సభ తొలి సమావేశాలనే వాయిదా వేయడం ద్వారా కేంద్రం చెప్పేసింది. దేశమంతటినీ ఆందోళన పరిచిన నీట్‌పై చర్చకు నిరాకరించడంలో నిరంకుశత్వం ప్రస్ఫుటమైంది. అలాగే డిప్యూటీ స్పీకర్‌ పదవికి ప్రతిపక్షాల అభ్యర్థనను పరిశీలించడానికి కూడా నిరాకరించడంలో సర్కారు సిద్ధం కాకపోవడం దాని భయాన్ని ప్రతిబింబిస్తున్నది. పదేళ్ల పోరాటం తర్వాత భారత రాజకీయ రంగంలో ప్రజాస్వామ్య లౌకిక శక్తుల పోరాటానికి ఒకింత చోటు లభించడం సానుకూల పరిణామం.
ఎ.పి విషయానికి వస్తే కేంద్రంలో పాలక కూటమి అతి పెద్ద మద్దతుదారుగా వున్న తెలుగుదేశం, దాని మిత్రపక్షాలైన జనసేన, బిజెపిల పాలన ప్రారంభమైంది. మోడీకి స్వంతంగా మెజార్టీ లేదుగనక కింగ్‌ మేకర్‌గా చంద్రబాబు నాయుడు స్పీకర్‌ పదవి కోరతారని, ఏదో తేడా వస్తుందని మీడియాలో వెలువడిన ఊహాగానాలు నిజం కాలేదు. ఎ.పి బిజెపి అధ్యక్షురాలైన పురంధేశ్వరి పేరు తెలుగు మీడియాలో విరివిగా వినిపించినా ఆ ప్రభావం కనిపించలేదు. డిప్యూటీ స్పీకర్‌గా బిజెపి భాగస్వామ్య పక్షాలకు అవకాశం అంటున్నారు గనక ఏం జరిగేది చూడవలసి వుంటుంది. ఏమైనా టిడిపి, దాని తర్వాత ప్రధాన మద్దతుదారుగా వున్న జెడియులు ఎ.పి, బీహార్‌ రాజకీయాల కోణంలో రాష్ట్రాల కోసం తప్ప కేంద్ర బిజెపి విధానాలను ప్రభావితం చేయడం జరగదని అర్థమవుతున్నది. ఆ విధమైన విధాన ప్రకటనలు, సూచనలు కూడా ఏమీ వెలువడింది లేదు. రాష్ట్రంలో వైసిపి పాలనపై శ్వేతపత్రాలను విడుదల చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం నిమగమై వుంది. అధికారుల నియామకాలు, బదిలీలు, పాత పాలకుల ఏజంట్లుగా వ్యవహరించిన వారికి హెచ్చరికలు వీటిపై దృష్టి కేంద్రీకృతమైంది. ఎన్నికల అనంతర ఉద్రేకాలు, ఉద్రిక్తతలు కూడా తీవ్రంగానే వుంటున్నాయి. సరైన అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలాల్లో కట్టారంటూ వైసిపి కార్యాలయాలకు నోటీసులు, కూల్చివేతలపై కోర్టుకు వెళ్లగా స్టే ఇచ్చి తీర్పు రిజర్వు చేశారు. తప్పులు జరిగి వుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి గాని కూల్చివేతలకు దిగితే గతంలో వలెనే కక్ష సాధింపు వాతావరణం పునరావృతమవుతుందని సిపిఎం, కాంగ్రెస్‌ వంటి పార్టీలూ, మీడియా కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి. అసలు మాజీ ముఖ్యమంత్రి జగన్‌ కార్యాచరణ కూడా ఇప్పటికీ వెల్లడి కాకపోగా అసలు శాసనసభకు వస్తారా అనేదానిపైనే సందేహాలు నెలకొన్న విచిత్ర పరిస్థితి.
జగన్‌ లేఖ
బలం తగ్గిన తాము శాసనసభకు వెళ్లినా సమయం ఇస్తారనే నమ్మకం లేదని జగన్‌ మొదట్లోనే మాట్లాడారు. తనపై తీవ్ర దుర్భాషలాడిన వ్యక్తిని స్పీకర్‌ను చేస్తున్నారని విమర్శించారు. సభ్యుడుగా ప్రమాణ స్వీకారం తర్వాతా ఆయన గాని ఇతర వైసిపి సభ్యులుగాని మీడియాతో పెద్దగా మాట్లాడలేదు. స్పీకర్‌ ఎన్నికలో గానీ పదవీ స్వీకారంలో గాని పాల్గొనలేదు. తర్వాత జగన్‌ ఆయనకు లేఖ రాస్తూ తన ఆరోపణను పునరుద్ఘాటించారు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే సభకు వస్తామని, లేకపోతే ప్రయోజనం వుండదన్నట్లు దాంట్లో పేర్కొన్నారు. లోక్‌సభ ఆనవాయితీ ప్రకారం ప్రతిపక్ష నాయకుడి హోదాకు అవసరమని భావిస్తున్న పది శాతం సీట్లు వైసిపికి రాలేదు గనక ఆ అవకాశం వుండదనే అభిప్రాయం బలంగా వుంది. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నా చట్టపరంగా మాత్రం ఇవ్వాలని చెప్పే బలమైన ఆధారాలు లేవు. ఇప్పుడు వైసిపికి వచ్చిన 11 సీట్ల కన్నా చాలా ఎక్కువ సీట్లు వచ్చిన సందర్భంలోనూ ప్రతిపక్ష నేతకు క్యాబినెట్‌ హోదా ఇవ్వలేదు. ఉమ్మడి ఎ.పి శాసనసభలో గానీ, గత రెండు లోక్‌సభలలో గానీ హోదాను ఆ కారణంగానే నిరాకరించారు. గత రెండు లోక్‌సభలలో కాంగ్రెస్‌కు 50 పైనే స్థానాలున్నా ఫలితం లేకపోయింది. ఫిరాయింపుల నిరోధ చట్టం తర్వాత పది శాతం వుంటేనే రాజకీయ పక్షం లేకపోతే గ్రూపు అన్న నిర్వచనం వర్తించదని ఒక వాదన, అయితే ఆ మేరకు పాత నిబంధనలు సవరించలేదు గనక ఆ వాదన నిలవదు. గతంలో పి.జనార్థనరెడ్డి, పి.ఉపేంద్రలకు పది శాతం లేకున్నా హోదా ఇచ్చారంటూ జగన్‌ ఇచ్చిన ఉదాహరణ కూడా పూర్తిగా నిజం కాదు. అతి పెద్ద ప్రతిపక్ష గ్రూపు నేతలుగా గుర్తించడం తప్ప రాజ్యాంగబద్దమైన ప్రతిపక్ష నేతలుగా వారికి సదుపాయాలు కల్పించింది లేదు. 70 మంది సభ్యులు గల ఢిల్లీ శాసనసభలో బిజెపికి ముగ్గురే వున్నా హోదా ఇచ్చిన ఉదాహరణ వుంది కాని అది అంతిమంగా స్పీకర్‌ విచక్షణపైనే ఆధారపడి, ఆయన ద్వారానే జరగవలసి వుంటుంది. ఎ.పి లో ఇప్పుడున్న అసహన వాతావరణంలో ఆ విధమైన అవకాశం లేదు. సూటిగా తిరస్కరించారు కూడా. ప్రజల తీర్పును గౌరవించి సభలో పాల్గొనాలనే అభిప్రాయమే అన్ని పార్టీలూ వెలిబుచ్చాయి. పైగా గత ప్రభుత్వానికి సంబంధించిన విమర్శలపై సమాధానాలు చెప్పడం ఆయన బాధ్యత కూడా. ఈ నేపథ్యంలో జగన్‌ లేఖ రాజకీయంగా రాసింది మాత్రమేనా లేక దానికి కట్టుబడి సభకు వచ్చినా ప్రయోజనం వుండదని సమర్థించుకోవడానికి ప్రయత్నమా అనేది ఆచరణలో చూడాలి.
రెండు రాష్ట్రాల సమస్యలు-బిజెపి
కేంద్రం నుంచి ఎ.పి ప్రయోజనాల సాధనకు తీవ్ర కృషి జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ తప్పిదాలనూ లోపాలను నివేదించడంతో పాటు తాము ఇచ్చిన హామీల అమలుకు తొలి సానుకూల ప్రాధాన్యత ఇవ్వాలని ఆశిస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడం వంటివి మరింత కీలకమవుతాయి. ఎన్‌డిఎలో కీలక భాగస్వామి అయినప్పటికీ రాష్ట్రంలో టిడిపి నాయకత్వమే వుంది గనక లౌకికతత్వానికి, మత సామరస్యానికి భంగం కలిగించే ఎలాంటి చర్యలకూ అవకాశం ఇవ్వరాదని ప్రజాస్వామిక వాదులు ఆకాంక్షిస్తున్నారు. రాష్ట్రంలో అసహన రాజకీయాలు, కక్ష సాధింపు వాతావరణం మారాలని, మీడియాపై ఆటంకాలు తొలగిపోవాలని ఎదురుచూస్తున్నారు. విభజిత రాష్ట్రంలో వరుసగా మూడు సార్లు ప్రభుత్వాలు మారుతున్న నేపథ్యంలో ఈ రెండు రాష్ట్ర పార్టీల మధ్యనే పరిభ్రమిస్తూ కేంద్రం పాత్ర మరుగుపడే పరిస్థితికి అవకాశమివ్వడం వాంఛనీయం కాదు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయడం వరకూ బాగానే వున్నా ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం పాత్రపై పల్లెత్తు మాట అనకుండా వుండటం ఎలా సాధ్యం? రాజధాని నిర్మాణం, విభజన సమస్యలు, హామీలు అన్నిటికీ ఇది వర్తిస్తుంది. ఇప్పటికీ వైసిపి కేంద్రంలో బిజెపినే మోస్తున్న తీరు చూస్తే ఎ.పి లో మోడీ ద్వంద్వ రాజకీయంలో మార్పు లేదనే అర్థమవుతుంది. ఇదే సమయంలో తెలంగాణ గవర్నర్‌గా వున్న బిజెపి నేత రాధాకృష్ణన్‌ చంద్రబాబును కలుసుకోవడం, బిఆర్‌ఎస్‌, బిజెపి కలసి పాచికలు వేస్తున్నాయనే వార్తలు, మరోవైపు బిఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరికలు భిన్న సంకేతాలకు ఆస్కారం ఇస్తున్నాయి. మరింత పెద్ద సంఖ్యలో బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎలు కాంగ్రెస్‌లో చేరతారనే వార్తల నేపథ్యంలో బిజెపి ఎలా వ్యవహరిస్తుందనేది చూడవలసిందే. టిడిపిని మళ్లీ తెలంగాణలో క్రియాశీలం చేయడానికి చంద్రబాబు నిర్ణయాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ కూడా తెలంగాణ సందర్శనలు చేస్తున్నారు. తెలంగాణలో ఎన్‌డిఎను ఏర్పాటు చేసేందుకు అడుగులు పడుతున్నాయా అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. చంద్రబాబుపై తనకు ఎంత గౌరవభావం వున్నా తన పదవికే ఎసరు తెచ్చుకునేలా ఎందుకు వ్యవహరిస్తానని రేవంత్‌ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయన ఆలోచనను వెల్లడించాయనుకోవాలి.
ప్రత్యేక పరిస్థితి
ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలను సహేతుకంగా రాజ్యాంగ బద్దంగా పరిష్కరించి సహాయపడే బదులు తన స్వప్రయోజనాల కోసం కేంద్రంలోని బిజెపి ఉభయ పక్షాలతో చెలగాటమాడటం నష్టదాయకం అవుతుంది. వివిధ రాష్ట్రాలలో తనతో చేతులు కలిపిన ఎజిపి, జెడిఎస్‌, బిఎస్‌పి, జెడియు వంటి పార్టీలను పథకం ప్రకారం దెబ్బ తీస్తూ వస్తున్న బిజెపి తెలుగు రాష్ట్రాలలో కూడా అంతకంటే భిన్నంగా వ్యవహరిస్తుందనుకోవడం పొరబాటు. పైగా స్వంత బలం తగ్గిన దృష్ట్యా ఈ తరహా కుటిల రాజకీయాలు ఇంకా తీవ్రం కావచ్చు కూడా. ఎన్నికల అవసరాల కోసం బిజెపితో చేరి మోడీ మూడో సర్కారుకు ప్రధాన ప్రాపుగా మారిన టిడిపికి ఈ వాస్తవాలు తెలియవని భావించలేము. ఇక ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న వైసిపి మనుగడ కోసం, కేసుల నుంచి రక్షణ కోసం బిజెపిని మరింత బలపర్చడమే తరుణోపాయమని భావించడం కూడా విచిత్రమే. తాము కాంగ్రెస్‌లో కలసిపోతామని కొందరు ఎ.పి బిజెపి నేతలు చెబుతున్న మాటలు నిజం కాదని కూడా వైసిపి వారంటున్నారు. బిఆర్‌ఎస్‌ తదుపరి అడుగుల విషయంలోనూ చాలా సందేహాలున్నాయి. ఏతావాతా రెండు రాష్ట్రాలలో వివిధ ప్రాంతీయ పార్టీలను తన గుప్పిట్లో పెట్టుకునే దిశలోనే బిజెపి అడుగులేస్తున్నది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను మరోసారి సిబిఐతో అరెస్టు చేయడంలోనూ ఆ యా పార్టీలను ఒత్తిడి పెట్టే ఎత్తుగడ వుంది. మోడీ సర్కారు మతతత్వ కార్పొరేట్‌ ఏకపక్ష విధానాలపై పోరాడేందుకు తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత వెసులుబాటు పెరిగినప్పటికీ తెలుగు రాష్ట్రాలలో నెలకొన్న ఈ పరిస్థితులను ప్రత్యేకంగా చూడవలసిన అగత్యమేర్పడుతున్నది. కనుకనే ఇక్కడ వామపక్ష లౌకిక శక్తులు, ప్రజాస్వామ్య ప్రియులు మరింత అప్రమత్తత వహించాల్సి వుంది. వివిధ పాలక పార్టీల వ్యూహాలకూ విశాల ప్రజాస్వామిక ప్రయోజనాలకు మధ్యన గల వ్యత్యాసాలను నిశితంగా గమనిస్తూ అడుగు వేయవలసి వుంటుంది.

తెలకపల్లి రవి

➡️