తెలంగాణ ఎన్నికలలో బిజెపి బిఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ బిజెపి హడావుడి మాత్రం తగ్గింది లేదు. లోక్సభ ఎన్నికల్లో కనీసం పది స్థానాలు తెచ్చుకోవాలి హోంమంత్రి అమిత్షా ఇటీవల దిశానిర్దేశం చేసివెళ్లారు కూడా. బిజెపిపై విమర్శలు తగ్గించి దగ్గరైనట్టు కనిపించడమే బిఆర్ఎస్ పరాజయానికి ఒక ముఖ్య కారణమని రాజకీయ వర్గాలు గట్టిగా అంచనా వేస్తున్నాయి.అయినా తమ వైఖరి మార్చుకోకపోగా అయోధ్యపైనా హిందువుల పైన ట్వీట్లు చేయడం ద్వారా హిందూత్వకు దగ్గరగా వున్నామనే భావం కలిగించేందుకు ఆ పార్టీ నాయకులు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్పై రాజకీయ విమర్శలు ఒకటైతే హిందువులకు వ్యతిరేకత కాంగ్రెస్ డిఎన్ఎలోనే వుందని ఆ పారీ ఎంఎల్సి కవిత ఇటీవల చేసిన వ్యాఖ్య ఇందుకు అద్దం పడుతుంది. ఇక ఆంధ్ర ప్రదేశ్లోనైతే పాలక వైసీపీ,ప్రతిపక్షాలుగా వున్న తెలుగుదేశం జనసేన పార్టీలు పొరబాటున కూడా బిజెపి మతరాజకీయాలనూ,నిరంకుశ పోకడలనూ ప్రస్తావించింది లేదు. ఆఖరుకు ప్రత్యేక హోదా,విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వంటి అంశాలలోనూ పూర్తి మౌనం పాటిస్తున్న పరిస్థితి. ఈ విధంగా ఎపిలో వలె పాలక ప్రతిపక్షాలు రెండూ బిజెపికి అనుకూలంగా వుండటం దేశంలోని మరే రాష్ట్రంలోనూ చూడం. తెలుగు రాష్ట్రాలలో బిజెపి పెద్ద శక్తి కాదుగనక దానిపై పోరాటం,విమర్శలు అవసరం లేదనేవాదన ఎంత తప్పో దీన్నిబట్టే తెలుస్తుంది.వామపక్షాలు మతతత్వ ప్రమాదం గురించి చెబితే ఏదో సిద్ధాంత పరంగా మాట్లాడటమే గాని ఇక్కడ వర్తించదని అపహాస్యం చేసేవారికి లోటు లేదు. అయితే మొన్న తెలంగాణ ఎన్నికల ఫలితాలు, ఎపితో సహా రెండుచోట్ల రాబోయే ఎన్నికల పోటీల తీరుతెన్నులు చూస్తే ఈ విధమైన వాదనలు ఎంత తప్పో స్పష్టమవుతుంది. తెలంగాణలో మరింతగా పాగా వేయడానికిఒక వైపు, ఎపిలో టిడిపి జనసేన కూటమితో కలసి పోటీ చేసేందుకు మరోవైపు బిజెపి పాచికలు వేస్తున్నదనే వాస్తవం ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తున్నది. నిజానికి విశాఖలో యువగళం ముగింపు సభకు ముందు టిడిపి నాయకుడు లోకేశ్ ఇచ్చిన ఇంటర్వ్యూలలో బాహాటంగానే బిజెపికి ఆహ్వానం పలికాడు.ఆ సభలో పవన్ కళ్యాణ్ బిజెపి ఆశీస్సులు కోరడం ద్వారా తమ వ్యూహాన్ని వెల్లడించారు.బిజెపికి తెలుగుదేశం తలుపులు తీసేవున్నాయని ఈ శీర్షికలో చాలాసార్లు చెప్పుకున్న విషయమే. కాకపోతే వైఎస్ షర్మిల ఎపిలో ప్రవేశించనుండటం దీనికి మరింత నాటకీయత తెచ్చిపెట్టింది.
ఎపి రాజకీయ పరిణామాలు
ఎపిలో అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు , సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు ఇలా అన్ని తరగతులూ పోరాటంలో వున్నా ప్రభుత్వ స్పందన లేకపోగా అరెస్టులతో బెదిరింపులతో విరుచుకుపడుతున్నది. పేదల సంక్షేమమే మా లక్ష్యమనే వారు ఈ అట్టడుగు వర్గాల శ్రామికుల న్యాయమైన కోర్కెల విషయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసేందుకు సిద్ధం కావడం లేదు. వీటిపైపోరాడబోతే పౌర హక్కులు, రాజకీయ కార్యకలాపాలపైన దాడులు సాగుతున్నాయి. సంక్షేమ పథకాల వరకూ మంచివైనా అభివృద్ధి, పాలనాపరమైన అసమర్థత,అవినీతి ఆరోపణలు, అప్పులు తీవ్ర ఉద్రిక్తతకు కారణమవుతున్నాయి.వైసీపీ టిడిపి జనసేన మధ్య అసహన రాజకీయాలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుతో పరాకాష్టకు చేరాయి. ఆయన బెయిలుపై విడుదలయ్యేసరికి ఎన్నికల వాతావరణం వచ్చేసింది గనక ఇప్పుడు అందరి దృష్టి అటే కేంద్రీకృతమైంది.చంద్రబాబు జైలులో వుండగానే టిడిపితో పొత్తును ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఎన్డిఎలో కొనసాగుతూ తన విమర్శలను జగన్ సర్కారు తొలగింపువరకే పరిమితం చేస్తున్నారు. కేంద్రంలో మోడీని పున:ప్రతిష్టించడం కోసమే పనిచేస్తున్నానని ప్రకటిస్తున్నారు. సనాతన ధర్మ ప్రవచనాలు తరచూ వినిపిస్తున్నారు.
మోడీకి నిరంతరం విధేయంగా వుండే జగన్ తన సర్కారుపై అసంతృప్తిని గుర్తించి అభ్యర్థుల భారీ మార్పుద్వారా గట్టెక్కాలనుకుంటున్నారు. సింహం సింగిల్గానే వస్తుందంటూ తమకు ఎవరితో రాజకీయంగా సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారు గాని ఆయన కూడా మోడీ విధానాలపై పల్లెత్తు మాట అనడం లేదు. ఇదే ఇప్పటి ఎన్నికల దృశ్యం. జగన్ ఢిల్లీ పర్యటనల్లో వినతులు తప్ప క్షేత్రస్థాయిలో రాజకీయ ఒత్తిడి రాష్ట్రం కోసం ఉమ్మడిగా ఉద్యమించడం వంటి ఉదాహరణలే చూడం.ఈ రెండు శిబిరాలు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు కేంద్రానికి ఫిర్యాదు చేయడంలోనే పోటీ పడుతుంటారు. పరస్పర పోటీలో మోడీ అశీస్సుల కోసం పాకులాడుతుంటారు.2019 ఎన్నికలకు ఏడాది ముందు బిజెపితో ఎన్డిఎతో విడగొట్టుకుని విమర్శలతో చెలరేగిపోయిన చంద్రబాబు ఓటమి తర్వాత ఎన్నడూ బిజెపి ని పల్లెత్తు మాట అనడంలేదు. తాను మోడీ విజన్ను ఎన్నడూ విమర్శించలేదని కేవలం ప్రజల సెంటిమెంటు కోసమే ప్రత్యేక హోదాపై విమర్శ చేశానని సంజాయిషీ ఇచ్చుకున్నారు. చంద్రబాబును జగన్ అరెస్టు చేయడం వెనక కేంద్రం ఆశీస్సులున్నాయని స్పష్టంగా తెలిసినా హోంమంత్రి అమిత్షాను ఆశ్రయించడానికే పాకులాడారు.ఆయన బహిరంగంగా మద్దతునివ్వకపోయినా బిజెపితో పొత్తు కలుపుకోవడానికే ప్రయత్నిస్తూ వస్తున్నారు.ఇప్పుడిప్పుడు ఆ ప్రయత్నాలు ఫలించినట్టు కూడా సంకేతాలు అందుకున్నామని టిడిపి నేతలు చెబుతున్న మాట.
తెలంగాణ ఎన్నికల తర్వాత..
తెలంగాణలో మొన్నటి ఎన్నికల్లో జనసేన పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుంది. టిడిపి పోటీ చేయకపోయినా తాను దాంతో కలసి పోటీ పెట్టి దెబ్బతిన్న పవన్ కళ్యాణ్ కూడా ఎపిలో ఆ బిజెపి ఆశీస్సుల కోసమే ఆరాటపడ్డారు.మరోవైపు తెలంగాణలో వైఎస్ఆర్టిపి పెట్టిన షర్మిల కాంగ్రెస్తో కలసిపోవడానికి చర్చలు జరిపారు. బిఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలిపోకూడదు గనక ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు వెల్లడించారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్తోనూ చర్చలు జరిపారు.అయితే తెలంగాణ కాంగ్రెస్అద్యక్షుడు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమె రాకను స్వాగతించలేదు.ఆమె కూడా ఆయన నాయకత్వాన్ని బలపర్చలేదు. ఆ విధమైన ప్రతిష్టంభన తర్వాత హఠాత్తుగా తాను అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని ఆగ్రహంతో ప్రకటించారు.మళ్లీ ఇంతలోనే తమ పార్టీ పోటీ చేయబోదని వెనక్కుతగ్గారు. కానీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నది లేదు. కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత కూడా తాను రేవంత్ కోసం మద్దతు నివ్వలేదని ప్రత్యేకంగా ప్రకటించారు. అందుకు తగినట్టే కాంగ్రెస్ నాయకత్వం కూడా షర్మిల పాత్రను ప్రస్తావించింది లేదు.నిజానికి షర్మిల రాజకీయాల్లో ప్రవేశిస్తారని ముందుగా చెప్పింది,ప్రధానంగా ప్రోత్సహించింది టిడిపి అనుకూల మీడియానే.ఎపిలో జగన్ వ్యతిరేక పోరాటంలో ఆమె వుండటం ఉపయోగమన్న అంచనాతోనే వారు వివేకానందరెడ్డి కుమార్తె సునీతనూ, షర్మిలను ప్రత్యేకంగా వార్తలలో నిలిపారు.తెలంగాణలో ప్రభుత్వ మార్పు తర్వాత ఆమె ఏపికి వస్తారనే కథనాలు ఈ క్రమంలోనే వచ్చాయి.ఇంతవరకూ ఆమె వాటిపై స్పందించింది లేదు గాని ఖండించనూ లేదు. ఎపి కాంగ్రెస్ నాయకులు ఢిల్లీవెళ్లి కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశమై చర్చలు జరిపిన తర్వాత దాదాపు ఇదే ధృవపరిచారు. అయితే ఆమె ఏ సమయంలో వస్తారు, అద్యక్ష పదవి ఇస్తారా వంటివే ఇప్పుడు తేలవలసి వుంటుంది.షర్మిల ఎపిలో ప్రవేశించడం సిఎం జగన్కు ప్రతికూలపరిణామమైనా ఆమె ఆయనపై ఏ విధంగా పోరాడతారో చూడవలసిందే. ఇదే సమయంలో వైసీపీలో టికెట్ల దుమారం మొదలైంది గనక బయిటకు వచ్చేవారిలో కొందరు ఆమె నాయకత్వంలో చేరవచ్చని అంచనాలున్నాయి.మంగళగిరి ఎంఎల్ఎగా వైదొలగిన ఆర్కే ఆ మేరకు ప్రకటన చేశారు కూడా. జగన్ వ్యతిరేక ఓట్ల చీలికకు ఇది ఎంతోకొంత కారణమవుతుందని టిడిపి వ్యూహకర్తలు భావిస్తున్నారు. అదెవరికి ఉపయోగమనే చర్చ కూడా నడుస్తున్నది.
ఎవరి పాత్ర ఏమిటి?
బిజెపితోటిడిపి కలిసేట్టయితే సిపిఐ కూడా వారితో విడగొట్టుకోకతప్పదని పరిశీలకులు భావిస్తున్నారు.తాము కాంగ్రెస్తో కలసి పోటీ చేస్తామని మరో సందర్భంలో సిపిఐ నేత ఒకరు సూచనగా అన్నారు. వామపక్షాలతో కలసి వెళతామని కాంగ్రెస్ రాష్ట్ర అద్యక్షుడు గిడుగు రుద్రరాజు చెప్పారు. బిజెపితో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కలిసే ఎవరితోనూ తమకు సంబంధం వుండబోదని సిపిఎం ఇప్పటికే స్పష్టంగా ప్రకటించింది, తమతో పొత్తుపై టిడిపి కావాలనే ఎక్కువగా చెబుతున్నదని,ఇంకా నిర్ణయం జరగలేదని బిజెపి నేతలు కొందరంటున్నారు. ఇంకా చాలా మార్పులు చూడవలసి వుంటుందని జనసేన ఆఫీస్ బేరర్ ఒకరు జోస్యం చెప్పారు. బిజెపి మాట ఏమైనా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్తో కలసి పోటీ చేయబోమని మాత్రం టిడిపి తేల్చి చెబుతున్నవిషయం.షర్మిల టిడిపి నేత లోకేశ్కు క్రిస్మస్ కానుక పంపడం, ప్రశాంత కిశోర్ చంద్రబాబును కలవడం పై మీడియా హైప్ ఎక్కువగా వచ్చింది తప్ప తమ విధానంలో మార్పు వుండదని వారంటున్నారు. ఈ లోగా సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ అంటూ స్థాపించి ప్రత్యేక హోదాను కీలక ఎజెండాగా ప్రకటించారు.మొదటి కార్యక్రమంగా వాజ్పేయి జయంతి జరిపారు!ఈ చిన్న పెద్ద విభిన్న రాజకీయ శక్తుల వైఖరి ఎలా వుండేది ఎన్నికల ప్రకటన తర్వాతనే స్పష్టమవుతుంది. తెలంగాణలో శాసనసభ ఎన్నికలు ముగిసినప్పటికీ లోక్సభ పోటీ కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ల మధ్య తీవ్రంగానే వుండవచ్చు. వచ్చే ఎన్నికల్లో తమకు 330 వరకూ స్థానాలు వస్తాయని బిజెపి చెబుతున్నా ఇండియా వేదిక పార్టీలు కలసి కట్టుగా సవాలు విసురుతున్న నేపథ్యంలో దక్షిణాదిలో సీట్లు పెంచుకోవాలని వ్యూహాలు రచిస్తున్నది. ఈ పూర్వరంగంలో ఎపి తెలంగాణలలో ప్రాంతీయ పార్టీలు బిజెపి ఛాయల్లోనే కొనసాగడం రాష్ట్రాలకు దేశంలో ప్రజాస్వామ్యానికి కూడా నష్టం కలిగించే విషయం.తెలంగాణలో కాంగ్రెస్ కూడా బిజెపిపై రాజకీయ సైద్ధాంతిక పోరాటం పదును పెంచవలసే వుంటుంది. అనేక రాష్ట్రాలలో ఆ పార్టీ తన స్థానిక ప్రత్యర్థులపై ఎక్కుపెట్టినంత గా బిజెపి మతతత్వంపై పోరాడాలని భావించడం లేదు. పెద్ద పార్టీగా లౌకిక శక్తుల ఐక్యత కోసం తగినంత కృషి చేయడమూ లేదు. మరో మూడు నాలుగు రోజుల్లో ఇండియా లో సర్దుబాట్లు పూర్తవుతాయని చెబుతున్న దృష్ట్యా ఏం జరుగుతుందో చూద్దాం.
తెలకపల్లి రవి