దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి కార్యక్రమాలను ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఫిలింఛాంబర్లో ఘనంగా నిర్వహించారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, దర్శకులు అనిల్ రావిపూడి, వశిష్ట, గోపీచంద్ మలినేని, విజరు కనకమేడల, శంకర్, రేలంగి నరసింహారావు, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్, నిర్మాత సి కల్యాణ్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, ఫిలింనగర్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అనుపమ రెడ్డి, నిర్మాత ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. తొలుత అందరూ ప్రాంగణంలోని దాసరి నారాయణరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ను ఈ నెల 19న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నట్లుగా నిర్వాహకులు ప్రకటించారు. ఆ ఈవెంట్ డేట్ పోస్టర్ ను తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా ఆవిష్కరించారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ దాసరి దర్శకుల సంఘానికే కాదు అన్ని సినీ కార్మిక సంఘాలకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ముందుకొచ్చేవారన్నారు. సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉండేవారన్నారు. దాసరి 151 సినిమా సందర్భంగా 151 మంది దర్శకులను సన్మానించారని గుర్తుచేశారు. ఆ రోజు కార్యక్రమంలో పాల్గొన్న కళాతపస్వి కె విశ్వనాథ్ దాసరి పుట్టినరోజుని డైరెక్టర్స్ డేగా జరపాలని సూచించారని గుర్తుచేశారు.