అడవికి ముప్పు

Nov 25,2023 10:11 #Jeevana Stories

ఒక రోజు సిద్ధు ఉండే వీధిలో డప్పు శబ్దం వస్తుంది. ‘మన గ్రామ పరిసరాలలో పెద్దపులి జాడలు కనబడుతున్నాయి. అందరూ తోటలకు, పొలాలకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించండి. ఒంటరిగా వెళ్ళవద్దు. రాత్రుల్లో బయట సంచరించవద్దు. పులిజాడలు కనబడితే వెంటనే అటవీశాఖకు తెలియజేయగలరు’ అని తలయారీ కేశవుడు టాంటాం వేస్తూ, గట్టిగా అరిచి చెబుతున్నాడు. నరసింహ మాస్టారు ఇంటి దగ్గరికి వచ్చేసరికి కేశవుడు ఒక కాగితంపై సంతకం పెట్టమని ఆయనకి ఇచ్చాడు. కాగితంపై మాస్టారు సంతకం చేశారు. మాస్టారు పక్కనే కూర్చుని ఉన్న ఆయన మనవడు సిద్ధు, ‘తాతయ్య! పులి అడవిలో సంచరించాలి కదా! మన గ్రామం వైపు ఎందుకు వచ్చేసింది?’ అని అడిగాడు. ‘సిద్దు! పులి అటవీ ప్రాంతంలో ఉండాలి. కానీ మనుషులమైన మనం రోజురోజుకీ అడవులను నరికి వేస్తున్నాము. అటవీ విస్తీర్ణం తగ్గిపోతుంది. జంతువులకు ఆవాసాలు కరువు అవుతున్నాయి. వాటికి ముప్పు కలిగిస్తున్నాం. అందుకే అవి గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి’ అని మాస్టారు సిద్ధుకి అర్థమయ్యేలా చెప్పారు. అడవులను రక్షించవలసిన బాధ్యత ఎవరిది?’ తాతయ్య అని అమాయకంగా అడిగాడు సిద్ధు. ‘అది ఏ ఒక్కరి బాధ్యతో కాదు. అడవుల సంరక్షణ సమిష్టి బాధ్యత. మనమంతా అడవుల రక్షణకు నడుం కట్టాలి. అప్పుడే అడవిలో జీవులకు రక్షణ ఉంటుంది. మనకు కూడా వాతావరణం బాగుండి, సకాలంలో వర్షాలు పడతాయి. పంటలు పండుతాయి’ అని ఎంతో ఓపికగా మనవడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు మాస్టారు. ‘నిజమే తాతయ్య! అందరూ ఈ విషయాన్ని తెలుసుకొని మెలగాలి. అటవీ విస్తీర్ణం పెంచేందుకు కృషి చేయాలి. అప్పుడే ఆనందంగా జీవించగలం. నేను ఈ విషయాన్ని మా స్కూల్లో పిల్లలందరికీ చెబుతాను’ అంటూ స్కూలుకి బయల్దేరాడు సిద్ధు.- మొర్రి గోపి,94945 90820.

➡️