ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఆదివారం 277 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం జిల్లాలోని 15 మండలాలు, విజయనగరంలోని 12, కాకినాడలోని 10, తూర్పుగోదావరి జిల్లాలోని 14, ప్రకాశం జిల్లాలోని 23, నెల్లూరు జిల్లాలోని 24, కడప జిల్లాలోని 19, తిరుపతిలోని 17 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని ఆ సంస్థ తెలిపింది. ప్రకాశం జిల్లా దరిమడుగులో శనివారం 47.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడప జిల్లా కలసపాడులో 46.4, నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో 46.2, నెల్లూరు జిల్లా అక్కమాంబపురంలో 46.1, పల్నాడు జిల్లా విజయపురి సౌత్లో 45.7, అన్నమయ్య జిల్లా గుర్రంకొండ 44.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 28 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 187 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.