ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ప్రముఖ రచయిత, జిల్లా పరిషత్ మాజీ సిఇఒ సోమేపల్లి వెంకట సుబ్బయ్య (66) గురువారం మృతి చెందారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుంటూరు విజయపురి కాలనీలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో డిప్యూటీ కలెక్టర్గా వెంకట సుబ్బయ్య పని చేశారు. జిల్లా పరిషత్ సిఇఒ, పులిచింతల ప్రత్యేక కలెక్టరుగా పని చేసి రిటైర్డు అయ్యారు. గుంటూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షులుగా పని చేశారు. ప్రస్తుతం ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయులు కార్యాలయంలో ఒఎస్డిగా పనిచేస్తున్నారు. ‘లోయలో మనిషి, తొలకరి చినుకులు, చెల్లకవ్వం, రెప్పల చప్పుడు, తదేక గీతం, పచ్చని వెన్నెల, మట్టి పొరలు, చేనుచెక్కిన శిల్పాలు, నాగలికి నా నమస్కారం’ పేరుతో ఆయన పలు పుస్తకాలను రచించారు. ఆయన రచనలకు పలు అవార్డులు, పురస్కారాలు లభించాయి. ఆయన రెండవ కుమారుడు విదేశాల్లో ఉండడం వల్ల అంత్యక్రియలు శనివారం జరిగే అవకాశం ఉంది. సోమేపల్లి మృతికి ఎంపి శ్రీకృష్ణదేవరాయులు, పలువురు సాహితీవేత్తలు ప్రగాఢ సంతాపం తెలిపారు.