ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రజానీకాన్ని భయపెడుతున్న వ్యాధుల్లో తలసేమియా ఒకటి. కేవలం జన్యుపరంగానే వచ్చే ఈ వ్యాధి నియంత్రణకు అనేక పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అనేక దేశాల్లో అత్యాధునిక చికిత్సలు అమల్లోకి వచ్చాయి. మన శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్ అందించేది మన రక్తంలోని ఎర్రరక్త కణాల్లో ఉండే హీమోగ్లోబిన్. ఎర్రరక్త కణాల తయారీలో ఏదైనా లోపం జరిగి, అవి సరిగ్గా ఏర్పడకపోతే వాటి ఆయుష్షు తగ్గిపోయి, త్వరగా చనిపోతాయి. శరీరంలో రక్తం శాతం తగ్గిపోయి రక్తహీనత ఏర్పడి మనిషి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటాడు. అలాంటి ఒక సమస్యే తలసేమియా. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) లెక్కల ప్రకారం ప్రపంచంలో నాలుగున్నర శాతం మంది చిన్నారులు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. మనదేశంలో మూడు కోట్ల యాభై లక్షల మందికి పైగా తలసేమియా బారినపడ్డారు. తల్లిదండ్రుల్లో ఉండే జన్యుపరమైన లోపాల వల్లగానీ, జన్యువుల్లో వ్యత్యాసాల వల్లగానీ ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఆటోసోమల్ పద్ధతిలో వారసత్వంగా కూడా వస్తుంది. ఈ నెల 8వ తేదీన ”ప్రపంచ తలసేమియా దినోత్సవం” సందర్భంగా ప్రత్యేక కథనం..
తలసేమియా ఒక జన్యు సంబంధమైన వ్యాధి. ఎముక మూలుగలోని ఎర్ర రక్తకణాల్లో ఉండే హీమోగ్లోబిన్ ఉత్పత్తిలో జరిగే లోపాన్ని ‘తలసేమియా’ వ్యాధి అంటారు. బిడ్డకు జన్మనిచ్చే వారి వల్లే ఈ ప్రాణాంతక వ్యాధి సంక్రమిస్తుంది. దీనిద్వారా జన్యువాహకులైన తల్లిదండ్రులకు (తలసేమియా మైనర్) జన్మించే బిడ్డల్లో పాతిక శాతం మంది పుట్టుకతోనే వ్యాధిగ్రస్తులయ్యే (తలసేమియా మేజర్) అవకాశం ఉంది. వ్యాధికి గురైన చిన్నారికి జీవితాంతం రక్తం ఎక్కిస్తూనే ఉండాలి.
రెండు రకాలు..
1. ఆల్ఫా తలసేమియా
2. బీటా తలసేమియా.
తలసేమియా రక్త తయారీ వ్యవస్థపై తన ప్రభావాన్ని చూపిస్తుంది. శ్వాసతో పీల్చుకునే ఆక్సిజన్ను రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకూ హిమోగ్లోబిన్ అందిస్తుంది. తలసేమియా రోగుల్లో శరీరానికి అవసరమైనంత హిమోగ్లోబిన్ ఉత్పత్తి కాదు. ఒకవేళ ఉత్పత్తయినా ఎక్కువకాలం అది నిల్వ ఉండదు. హిమోగ్లోబిన్ నిల్వలు పడిపోయిన ప్రతిసారీ హిమోగ్లోబిన్ని కృత్రిమంగా రక్తం ద్వారా అందించాలి. సకాలంలో అందించకపోతే ప్రాణాప్రాయం ఉంటుంది.
తలసేమియా అనేది ఎర్రరక్త కణాలను ప్రభావితం చేసే పరిస్థితి. ఎర్రరక్త కణాలు ఎముకల లోపల, ఎముక మజ్జ అని పిలువబడే భాగంలో తయారవుతాయి. ఎర్రరక్త కణాలు ‘హిమోగ్లోబిన్’ అనే ప్రోటీన్ను ఉపయోగించి, శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ను సరఫరా చేస్తాయి. రక్తంలో హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉన్నప్పుడు దీనిని ‘రక్తహీనత’ అంటారు.
సాధారణంగా వయసుకు వచ్చిన వారి హీమోగ్లోబిన్లో నాలుగు ప్రోటీన్లు ఉండగా, వాటిలో రెండు ఆల్ఫా, రెండు బీటా గ్లోబిన్ శ్రేణులు ఉంటాయి.
తలసేమియా రోగుల్లో ఆల్ఫా లేదా బీటా గ్లోబిన్ శ్రేణులలో లోపం వల్ల అసాధారణంగా రక్తకణాలు ఉత్పత్తి అవుతాయి.
హీమోగ్లోబిన్లోని ఏ శ్రేణి ప్రభావితమైందనేదాన్ని బట్టి తలసేమియా వ్యాధిని విభజిస్తారు.
ఆల్ఫా గ్లోబిన్ శ్రేణి ప్రభావితమైతే దానిని ఆల్ఫా తలసేమియా అని, బీటా గ్లోబిన్ శ్రేణి ప్రభావితమైతే దానిని బీటా తలసేమియా అని అంటారు.
ప్రతి రకానికీ పరిస్థితి తీవ్రతల్లో ఎక్కువ, తక్కువలు ఉంటాయి. మన దేశ జనాభాలో బీటా తలసేమియా ఎక్కువగా కనిపిస్తుంది.
బీటా తలసేమియా
తీవ్రత ఆధారంగా తలసేమియాను మళ్లీ నాలుగు రకాలుగా వర్గీకరించారు.
తలసేమియా ట్రేట్ : చాలా తక్కువ తీవ్రత ఉండే రకం ఇది. జీవిత కాలంలో అసలు ఎలాంటి లక్షణాలూ ఉండకపోవచ్చు.
తలసేమియా మైనర్ : స్వల్ప లక్షణాలు ఉంటాయి. పరీక్షలు చేస్తే రక్తహీనత ఉందని తెలియడం వల్ల ఈ వ్యాధి నిర్ధారణ జరగొచ్చు.
తలసేమియా ఇంటర్మీడియా: రక్తహీనత లక్షణాలు కనిపించిన వారిలో ఈ వ్యాధి నిర్ధారణ అవ్వవచ్చు. రక్తం ఎక్కించే అవసరం కూడా రావొచ్చు.
ట్రాన్స్ఫ్యూజన్ డిపార్ట్మెంట్ : తరచూ రక్తం ఎక్కిస్తూ ఉండాలి. లేదంటే ప్రాణాపాయం కలుగుతుంది. తరచూ రక్తం ఎక్కించడం వల్ల శరీరంలో ఐరన్ నిల్వలు పెరిగి, ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంది.
చికిత్స
– తలసేమియా వ్యాధికి లక్షణాలను అనుసరించి, చికిత్స చేస్తారు.
– వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి శరీరంలో ఎర్రరక్తకణాల సంఖ్యను పెంచడానికి 15 నుంచి 20 రోజులకు ఒక్కసారి రక్తం ఎక్కిస్తారు.
– ఎముక మూలుగలో ఉన్న కణాలను మార్పిడి చేసి వ్యాధి తీవ్రతను తగ్గిస్తారు. రక్తం ఎక్కించే అవసరాన్ని తగ్గించొచ్చు.
-తీవ్రమైన ఇన్ఫెక్షన్లు కలిగే ప్రమాదం ఎక్కువ కాబట్టి, వీరు తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు తీసుకుంటూ, తరుచూ రోగాల బారిన పడకుండా వ్యక్తిగత పరిశుభ్రత, ఇతర జాగ్రత్తలు తీసుకోవాలి.
తర్వాతి తరానికి రాకుండా ఉండాలంటే..
– తీవ్రమైన వ్యాధి ఉన్న పిల్లలకు లక్షణాలు మూడు నెలలు దాటినప్పటి నుంచే కనిపిస్తాయి.
– రక్తహీనత ఉందని తెలిసినపుడు, దానికి కారణం తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
-సాధారణ రక్త పరీక్ష (సిబిపి) లేదా హీమోగ్రాం చేసినప్పుడు అసాధారణంగా ఉన్న రక్తకణాలను గుర్తించవచ్చు.
– హీమోగ్లోబిన్ ఎలక్ట్రోఫొరేసిస్ పరీక్ష చేయడం వల్ల తలసేమియా వ్యాధి రకం, తీవ్రత తెలుస్తాయి.
– జన్యు పరమైన పరీక్షలు చేసి, తరువాతి తరం వారికి ఈ సమస్య కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
– తలసేమియా వ్యాధి బాధిత కుటుంబాలు జన్యుపరమైన పరీక్షలు చేయించుకోవడం అవసరం. గర్భం దాల్చాలనుకొనేవారు తలసేమియా వ్యాధి పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తారు.
మనదేశంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తలసేమియా వ్యాధి గురించిన అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నాయి. వాటికి హాజరైతే అవగాహన పెంచుకోవచ్చు.
తలసేమియా రోగులకు తరచూ రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. ఒక మనిషి రక్తం ఇస్తేనే మరో మనిషికి అందించడం సాధ్యమవుతుంది. అందువల్ల రక్తదానంపై ప్రజల్లో అవగాహన మరింతగా పెరగాలి. ఆరోగ్యంగా ఉన్న మనిషి మూడు నెలలకు ఒకసారి రక్తం ఇవ్వొచ్చు.
లక్షణాలు
– కుటుంబంలో ఎవరికైనా తలసేమియా ఉంటే వారికి పుట్టిన పిల్లలకు పరీక్ష చేస్తే ముందే గుర్తించగలం.
– వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో మూడు నెలల నుంచి 18 నెలల వయస్సు మధ్యలో ఈ వ్యాధి బయటపడుతుంది.
శరీర రంగు పాలిపోయినట్టుగా మారుతుంది.
– శారీరక ఎదుగుదల ఉండదు.
– ఎర్రరక్త కణాలు అధికంగా నాశనం అవ్వడం వల్ల, పచ్చ కామెర్లు కలుగవచ్చు.
– రక్తహీనత వల్ల ఆయాసం, అలసట, నీరసం, శరీరంలో వాపులు రావడం, రోగ నిరోధక శక్తి తక్కువ ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
– ఈ పిల్లలు తరచుగా అనారోగ్యాలకు గురవుతుంటారు. ముఖ్యంగా వాంతులు, విరేచనాలు, లేక శ్వాస సంబంధిత సమస్యలు వస్తుంటాయి.
– వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్న వారిలో ఏదైనా ఆపరేషన్ చేసే సమయంలో లేదా గర్భం దాల్చినపుడు, కాన్పు తరవాత మాత్రమే గుర్తించే అవకాశం ఉంది.
డాక్టర్ శ్రావణ్కుమార్ బోడేపూడి వీ.ణ ణ.వీ
మెడికల్ డ హెమటో ఆంకాలజిస్ట్,
బోన్మారో ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్
మణిపాల్ ఆసుపత్రి, తాడేపల్లి, గుంటూరు జిల్లా.
9032102102
-యడవల్లి శ్రీనివాసరావు
9490099214