కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాలు : ముగిసిన కార్మిక, రైతు సంఘాల మహాధర్నా

రైతు పోరాటాలకు పూర్తి మద్దతు యుటిఎఫ్‌ అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు, బెఫి నేత ఆర్‌.అజయ్ కుమార్‌

రైతులు, కార్మికులు చేస్తున్న పోరాటం వారికోసమే కాదు, దేశ ప్రజలందరి కోసం. అందుకనే ఈ పోరాటానికి ఉపాధ్యయులు, బ్యాంకింగ్‌ రంగ సిబ్బంది నుండి పూర్తి మద్దతు ఇస్తున్నాము. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును అడ్డుకోవాలి. లేనిపక్షంలో మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది.

నోరెత్తితే అరెస్టులు చేస్తున్నారు : న్యాయవాదులు ముప్పాళ్ల సుబ్బారావు, సుంకర రాజేంద్రప్రసాద్‌

ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై నోరెత్తితే పోలీసులతో అరెస్టులు చేయిస్తున్నారు. కేంద్రం మతోన్మాదాన్ని రెచ్చగొడుతుంటే, రాష్ట్రం ప్రజాపోరాటాల అణచివేసేందుకు నిర్బంధాలకు దిగుతోంది. విలువైన గనులను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ఇష్టారీతిగా దోపిడీకి పాల్పడుతున్నారు. సహజ వనరులదోపిడీ కోసమే మణిపూర్లో కుకీలపై దాడులకు రెచ్చగొట్టారు. ఇటువంటి వాటిని కాపాడాల్సిన న్యాయవ్యవస్థపైనా కేంద్రం దాడికి దిగుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును అమ్ముతోంది. రాజ్యాంగాన్ని, లౌకికతత్వాన్ని తుంగలో తొక్కుతున్నారు. మతపిచ్చి ప్రజలకు ఎక్కించి శాశ్వతంగా అధికారంలోకి ఉండాలని కోరుకుంటున్నారు. దీన్ని దేశ ప్రజలు అంగీకరించరు.

మతోన్మాదంతో హత్యలకు పాల్పడుతున్నారు : అవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి చిస్తీ

గోరక్షణ, లవ్‌ జిహాద్‌ పేరుతో మతోన్మాదులు హత్యలకు పాల్పడుతున్నారు. మోడీ హిందూత్వం పేరుతో హింసను ప్రేరేపిస్తున్నారు. ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనల్లో అందరూ కలిసి రావాలి.

సహజ వనరులను దోచేస్తున్నారు : పర్యావరణ వేత్త రాందేవ్‌

రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను దోచేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న గ్యాస్‌ను గుజరాత్‌కు తరలించుకుపోయి అదే గ్యాస్‌ను మనకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. మన గ్యాస్‌ను మనం ఎందుకు వినియోగించుకోకూడదు. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలి. లేదా ప్రజలంతా నిలదీయాలి.

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కార్మికులు, రైతులకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై ఐక్య సమరం ద్వారానే హక్కులు సాధించుకోగలమని వక్తలు పిలుపునిచ్చారు. విజయవాడ జింఖానా గ్రౌండ్‌లో 36గంటల పాటు జరిగిన మహా ధర్నా మంగళవారం సాయంత్రం ముగిసింది. వేలమంది రైతులు, కార్మికులు తరలిరావడంతో జింఖానా గ్రౌండ్‌ కిక్కిరిసిపోయింది. రెండోరోజు సభకు వై.కేశవరావు, కెవివి ప్రసాదు, జాస్తి కిషోర్‌బాబు, కె.ధనలక్ష్మి, చుండూరి రంగారావు అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ఉదయం నుంచి వివిధ సంఘాల నాయకులు చెందిన మాట్లాడుతూ. దేశ వ్యాప్తంగా రైతులు, కార్మికులకు న్యాయం జరిగిందంటే పోరాటాల ద్వారానే సాధ్యమైందని పేర్కొన్నారు. నరేంద్రమోడీ అనుసరిస్తున్న విధానాలను కూడా పోరాటాల ద్వారానే ఎదుర్కోవాలని, అది కార్మిక, కర్షక ఐక్యతతోనే సాధ్యమవుతుందని అన్నారు. సంతలో పశువుల్లా కొంటున్నారు.

అన్నిటినీ మార్కెట్‌ చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరరావు

ఉచితంగా ప్రజలకు అందించాల్సిన వాటినీ ప్రభుత్వం మార్కెట్‌ సరుకుగా చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారు. ప్రజలతో ఎన్నుకుని ప్రభుత్వాన్ని నడుపుతూ అదే ప్రజలపై భారాలు వేసి వారిని ముప్పుతిప్పలు పెట్టడం ఎంతవరకు సమంజసం. కార్పొరేట్లకు దోచిపెట్టడం కోసమే పాలన చేస్తున్నారా అన్నట్లు ఈ ప్రాంతీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి.

ప్రాజెక్టులను పూర్తి చేయాలి :  రైెతు నాయకులు కె.ప్రభాకరరెడ్డి, కొల్లా రాజమోహన్‌

ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారానే అక్కడ కరువు పరిస్థితులను ఎదుర్కోవచ్చు, రైతులను కాపాడవచ్చు. కానీ పాలకులు ఆదివగా ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తి చేస్తే అక్కడ కరువును నివారించవచ్చు ఆపని చేయడం లేదు.

రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది : కృష్ణా జెడ్‌పి మాజీ ఛైర్‌పర్సన్‌

అనూరాధవ్యవసాయాన్ని కాపాడుకోవాలని కృష్ణా జిల్లా మాజీ జెడ్‌పి ఛైర్‌పర్సన్‌ గద్దె అనూరాధ అన్నారు. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది. మహిళలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ప్రచ్చన్న నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్నారు. వారికి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది.

సంతలో పశువుల్లా కొంటున్నారు : సిఐటియు నాయకులు వి.ఉమామహేశ్వరరావు

కేంద్రంలో బిజెపి వచ్చాక ఎంఎల్‌ఎలు, ఎంపిలను సంతల్లో పశువుల్లా కొంటున్నారని, ఇ.డి, సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో బెదించి లొంగదీసుకుంటున్నారని సిఐటియు రాష్ట్ర నాయకులు వి ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్రాల హక్కులను, ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతున్న బిజెపితో వైసిపి, టిడిపి, జనసేన అంటకాగడం దేనికని ప్రశ్నించారు.

రైతు ఉత్పత్తులను నేరుగా కొనాలి : సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎ.వి.నాగేశ్వరరావు

రైతు ఉత్పత్తులను నేరుగా ప్రభుత్వం కొని ప్రజలకు పంపిణీ చేయాలి. ఈ విషయంలో కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను అనుసరించాలి. పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులను తగ్గించాలి. గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గించాలి. ప్రజలకు తక్కువ ధరకే నిత్యావసరాలు అందేలా చూడాలి. అంతేగానీ కార్పొరేట్ల చేతుల్లో పెట్టి ప్రజలను దోచుకునే విధానాన్ని అడ్డుకోవాలి.

పోరాటం కోసం పోరాటాలు చేయాల్సిన పరిస్థితి : ఎపి ఎన్‌జిఓ సంఘ నాయకులు ఎ.వి.సాగర్‌

ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్నారు. వారు ప్రశ్నిస్తే కేసులు బనాయిస్తున్నారు. పోరాటాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగులు, కార్మికులు, రైతులు అందరినీ పక్కనబెట్టే పరిస్థితి దాపురించింది. ఇతర రాష్ట్రాల్లో ప్రజల హక్కులపై నినదిస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. నోరెత్తనీయడం లేదు. మీటింగులు పెట్టనీయడం లేదు. పోరాటం కోసం పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

రవాణా రంగాన్ని ఆదుకోవాలి :  లారీ ట్రాన్స్‌పోర్టు నాయకులు వైవి ఈశ్వరరావు, తుమ్మల లక్ష్మణస్వామి

దేశానికి రైతులు, శ్రామికులు ఎంత అవసరమో రవాణా రంగం కూడా అంతే అవసరం. జాతీయ లాజిస్టిక్‌ పాలసీ పేరుతో రవాణా వ్యవస్థను దెబ్బతీస్తున్నారు. మోయలేని భారాలు మోపుతున్నారు. డీజిల్‌, టోల్‌గేటు రేట్లు తగ్గించకుండా అది సాధ్యం కాదు. కేంద్రం ద్వంద్వ వైఖరి అనుసరిస్తోంది. దీన్ని అడ్డుకోవడానికి జరిగే పోరాటంలో అందరం కలిసి వస్తాము.

బలిచ్చే ముందు అలంకరించినట్లు స్కూళ్లను చేస్తున్నారు : ఎపిటిఎఫ్‌ నాయకులు భానుమూర్తి

పాఠశాలలను నిర్వీర్యం చేసేందుకు విద్యా వ్యవస్థను ధ్వంసం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నారు. బలిచ్చే ముందు మేకను అలంకరించినట్లు స్కూళ్లను అలంకరించి వాటిని కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

పత్రికా స్వేచ్చను దెబ్బతీస్తున్నారు : ఐజెయు నాయకులు సోమసుందర్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యమాలను అనుమతించడం లేదు. జర్నలిస్టులు కూడా బాధితులే. సమస్యలపై రోడ్డెక్కడానికి ప్రయత్నించిన అన్ని సందర్భాల్లోనూ ఆంక్షలు పెడుతున్నారు. నోరెత్తనీయడం లేదు. నిజాన్ని నిర్భయంగా చెబితే మీడియా సంస్థలపై కేసులు నమోదు చేసి జర్నలిస్టులను జైళ్లలో పెడుతున్నారు.

ప్రజలను చీల్చి పాలన చేస్తున్నారు : ఎం.వెంకటరెడ్డి, స్త్రీ విముక్తి సంఘటన నాయకులు చల్లపల్లి విజయ, పిఓడబ్ల్యు నాయకులు పద్మ

ప్రజలను చీల్చి అధికారంలో శాశ్వతంగా ఉండాలనే ఆలోచనతో పాలకులు వ్యవహరిస్తున్నారు. వాటిని ధీటుగా కార్మికులు, రైతులు ఎదుర్కొవాలి. లేకపోతే మనుగడ కష్టమవుతుంది. మహిళలను అన్యాయంగా చంపిన మతోన్మాదులపై చర్యలు తీసుకోవాలి. మణిపూర్లో జాతుల సమస్య అంటే కరెక్టు కాదు. అది భూమి సమస్య అన్నారు. ముఖ్యమంత్రి కుట్రగా చూడాలి. పోరాటానికి సన్నద్ధం కావాలి. రైతు నాయకులు హరినాథ్‌, కార్మిక నాయకులు రవీంద్రనాథ్‌, క్రాంతికుమార్‌రైతులకు గిట్టుబాటు ధరలు అందించాలని స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన సూచనలను కేంద్రం అమలు చేయాలి. రైతులు, శ్రామికులపై దాడులకు దిగుతున్న మోడీ ప్రభుత్వంపై పోరాటం కొనసాగించాలి. కేంద్రంలో బిజెపిని, రాష్ట్రంలో ఉన్న వైసిపిని గద్దె దించాలి, నోరెత్తని తెలుగుదేశం, జనసేనకు బుద్దిచెప్పాలి. కరువు పట్టడం లేదు. ఎఐకెఎస్‌ నాయకులు కె.రామచంద్రయ్య, కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు జెట్టి గుర్నాథరావురాష్ట్రంలో కరువు తాండవిస్తోంది. దీన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రజలను పట్టించుకోవడం లేదు. ప్రజలు తిండిలేక అల్లాడుతుంటే అదేమీ పెద్ద సమస్యకాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇటువంటి పాలకులకు బుద్దిచెప్పాల్సిన అవసరం ఉంది.

ఎల్‌ఐసిని కాపాడుకోవాలి : ఐసిఇయు నేత కిషోర్‌కుమార్‌

45 లక్షల కోట్ల విలువైన ఆస్తులున్న ఎల్‌ఐసిని ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. దీన్ని అడ్డుకునేందుకు జరిగే పోరాటంలో అందరూ కలిసి రావాలి. దేశంలో కోట్లమంది జీవితాలకు భద్రత కల్పిస్తున్న ఎల్‌ఐసిని దెబ్బతీయడం అంటే దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే. దీనిపై గళమెత్తాలి.

ప్రజల సంపదను దోచి పెడుతున్నారు : రైతు నేతలు ఇండ్ల ప్రభాకరరెడ్డి, రాధాకృష్ణమూర్తి

ప్రజల సంపదను అదానీ, అంబానీలకు దోచీపెడుతున్నారు. ఇదెక్కడి పాలనో అర్థం కావడం లేదు. దీనిపై రైతులు, కార్మికులు, శ్రామికులు, ఉద్యోగులు ఆలోచించాలి. మహాధర్నా భవిష్యత్‌ ఉద్యమాలకు సూచికగా కనిపిస్తోంది. ఢిల్లీ ఉద్యమం రైతులను ఉత్సాహపరిచింది. దీన్ని కొనసాగించాలి.

ప్రశ్నిస్తే వేధిస్తున్నారు : రైతు కూలీ సంఘం నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు

కేంద్ర చేస్తున్న తప్పులు ప్రశ్నించిన వారిని ఎత్తిచూపిన వారిని అరెస్టులు చేయిస్తున్నారు. ఉపా చట్టాలు మోపుతున్నారు. కార్పొరేట్‌శక్తులు దోచుకుంటుంటే వాటిని అడ్డుకున్న ఆదివాసీలకు మద్దతుగా నిలిచిన వారిపైనా దేశ ద్రోహం కేసులు బనాయించారు. అడ్డుకునేందుకు జరిగే అన్ని పోరాటాల్లోనూ అందరూ కలిసి రావాలి.

➡️